ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత చతికిలపడింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చిత్తుగా ఓడింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్లతో 112 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించగా.. అభిషేక్ పోరెల్(19 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 30) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ తలో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో 205 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 108 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 93 నాటౌట్) రాణించాడు. ఇద్దరే లక్ష్యాన్ని చేధించడం గమనార్హం. ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఢిల్లీ ఓటమితో గుజరాత్తో పాటు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.
ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇంటిముఖం పడుతోంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఢిల్లీ ఈ రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ ఇంటిదారి పడుతుంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరాయి. ఈ మూడు జట్లు 17 పాయింట్స్తో ఉన్నాయి. నాలుగో స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో పోటీపడుతున్నాయి. ముంబై 14 పాయింట్స్, ఢిల్లీ 13, లక్నో 10 పాయింట్స్తో ఉన్నాయి. ముంబైకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.