ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సమాయాత్తం అవుతోంది. తమ జట్టు ప్రక్షాళనకు పూనుకున్న ఢిల్లీ మేనేజ్మెంట్.. ముందుగా హెడ్ కోచ్ రికీ పాంటింగ్పై వేటు వేసింది. తదుపరి హెడ్ కోచ్గా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లను నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ విన్నర్స్ యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో ఢిల్లీ మేనేజ్మెంట్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 31లోగా తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను బీసీసీఐ అదేశించింది. ఐదుగురిని నేరుగా రిటైన్ చేసుకోవడంతో ఒక ఆర్టీమ్ కార్డ్కు అవకాశం కల్పించింది. పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది.

ఇక రికీ పాంటింగ్ను తొలగించిన అనంతరం రాహుల్ ద్రవిడ్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది. కానీ అతను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో ఢిల్లీ.. కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. విదేశీ కోచ్ల కంటే స్వదేశీ ఆటగాళ్లనే నియమించుకోవాలని భావిస్తోంది.
ప్రతిభ కలిగిన ఇండియన్ ప్లేయర్లను జట్టులోకి తీసుకురావాలంటే స్వదేశీ కోచ్లే ఉండాలని నమ్ముతోంది. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీకి యువరాజ్ సింగ్తో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అతనే హెడ్ కోచ్గా ఎంపికవుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇప్పటికే యువరాజ్ సింగ్.. కొంతమంది కుర్రాళ్లకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. అభిషేక్ శర్మ, దేవదత్ పడిక్కల్ వంటి కుర్రాళ్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. సపోర్ట్ స్టాఫ్ కూడా పూర్తిగా స్వదేశీ ఆటగాళ్లే ఉండాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది. టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్లను అసిస్టెంట్ కోచ్లుగా నియమించుకోవాలనుకుంటోంది.
లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే కోచ్లను నియమించుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇంకా జాప్యం చేస్తోంది. హెడ్ కోచ్ ఖరారు అయితేనే.. రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకోవడాని ఆస్కారం ఉంటుంది. లేకుంటే సౌరవ్ గంగూలీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమ కెప్టెన్ రిషభ్ పంత్ను రిటైన్ చేసుకుంటామని ఇప్పటికే ఢిల్లీ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.