టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను జట్టులో కొనసాగించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ తెలిపాడు. అతన్ని వదులుకోవడానికి తమకు మనసొప్పలేదని, కానీ వదులుకోక తప్పలేదన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ అయిన రిషభ్ పంత్ను మెగా వేలంలోకి వదిలేసింది.
సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా నవంబర్ 24, 25న జరిగిన మెగా వేలంలోనూ పంత్ కోసం ఢిల్లీ బిడ్ వేయలేదు. కానీ అతన్ని ఆర్టీఎమ్ కార్డ్ కింద తీసుకునేందుకు ప్రయత్నించింది. కానీ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు బిడ్ వేయడంతో పంత్ను దక్కించుకోలేకపోయింది. అయితే రిషభ్ పంత్ ఢిల్లీని వీడడానికి గల కారణాన్ని పార్థ్ జిందాల్ తాజాగా వెల్లడించాడు.

మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు..
గత సీజన్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ను పంత్ అపార్థం చేసుకున్నాడని, దాంతోనే తీవ్ర భావోద్వేగానికి గురై జట్టును వీడాడని తెలిపాడు. 'రిషభ్ పంత్ను రిటైన్ చేసుకోకపోవడం అనేది ఢిల్లీ మేనేజ్మెంట్ నిర్ణయం కాదు. మేనేజ్మెంట్, పంత్ కలిసి సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం. రిషభ్ పంత్తో మేం సుదీర్ఘమైన చర్చలు జరిపాం. అతన్ని జట్టులో ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నించాం.
అయితే గత కొన్ని సీజన్లుగా జట్టు ప్రదర్శన మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్లుగా లేదని చెప్పాం. పంత్ కెప్టెన్సీ గురించి నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇచ్చాం. ఈ ఫీడ్ బ్యాక్ను అతను అపార్థం చేసుకున్నాడు. వెంటనే భావోద్వేగపూరితమైన నిర్ణయం తీసుకున్నాడు.
మనసొప్పలేదు..
జట్టులో కొనసాగాలని పంత్ను నాతో సహా కిరణ్ కుమార్ గ్రంధి, ఇతర సహా యజమానులం ఒప్పించే ప్రయత్నం చేశాం. కానీ అప్పటికే పంత్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయాన్ని నేను గౌరవించాను. వేలంలో నీ కోసం బిడ్ వేయమని కూడా హామీ ఇచ్చాం. కానీ పంత్ను వదులుకునేందుకు మనసొప్పలేదు. దాంతో కిరణ్ నేను పంత్ను తిరిగి కొనుగోలు చేయాలనుకున్నాం.
ఆర్టీఎమ్ కార్డ్తో తీసుకోవాలనుకున్నాం. కానీ ధర చాలా ఎక్కువవడంతో ఏం చేయలేకపోయాం. రిషభ్ పంత్ ఢిల్లీతోనే ఆటగాడిగా ఎదిగాడు. కిరణ్ అతనికి మొదటి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నేను ఈ జట్టులో భాగమయ్యాను. అతనితో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది'అని పార్థ్ జిందాల్ వివరించాడు.
పంత్ ప్రయాణం ఢిల్లీతోనే మొదలు..
2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన రిషభ్ పంత్.. వరుసగా 6 ఏళ్ల పాటు ఆ జట్టులోనే కొనసాగాడు. రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి అండగా నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తం ఆడకపోయినా.. ఐపీఎల్ 2024 సీజన్లో మళ్లీ కెప్టెన్గా నియమించింది.