మహేంద్ర సింగ్ ధోనీ కోసమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లాలనుకున్నానని టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ తెలిపాడు. తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ ఎంపికైనప్పుడు తనకు ధోనీ అండగా నిలిచాడని, అందుకే ఆ జట్టులోకి వెళ్లాలనుకున్నాని చెప్పాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో దీపక్ చాహర్ను ముంబై ఇండియన్స్ రూ. 9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీపక్ చాహర్ కోసం రూ. 9 కోట్ల వరకు బిడ్ వేసిన సీఎస్కే ఆ తర్వాత వెనకడుగు వేసింది. 6 ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన దీపక్ చాహర్.. మొత్తం 76 మ్యాచ్ల్లో 76 వికెట్లు పడగొట్టాడు.

అందుకే సీఎస్కే తీసుకోలేదు..
ముఖ్యంగా పవర్ ప్లేలో నిలకడగా వికెట్లు తీస్తూ ఆ జట్టుకు శుభారంభాలు అందించాడు. ఈ క్రమంలోనే దీపక్ చాహర్ను తిరిగి కొనుగోలు చేసేందుకు చెన్నై ప్రయత్నించింది. తాజాగా ఈ వ్యవహారంపై ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపక్ చాహర్.. సీఎస్కే తనను కొనుగోలు చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
మెగా వేలంలో రెండో రోజు తన పేరు రావడం, అప్పటికే చెన్నై పర్స్ వాల్యూ తగ్గడంతోనే కొనుగోలు చేయలేకపోయిందన్నాడు. చెన్నైని వీడటం బాధగా ఉందని చెప్పాడు.
ధోనీ భాయ్ కోసం..
'చెన్నైకి ఎంపికైన ఆరంభంలో మహీ భాయ్ అండగా నిలిచాడు. అందుకే ఆ జట్టుకు ఆడాలనుకున్నా. కానీ మెగా వేలంలో నా పేరు రెండో రోజు వచ్చింది. దాంతో సీఎస్కే నన్ను కొనుగోలు చేయడం కష్టమని భావించా. అయినా ఆ జట్టు నా కోసం ప్రయత్నించింది. రూ. 13 కోట్ల పర్స్ వాల్యూలో రూ. 9 కోట్ల వరకు బిడ్ వేసింది.
గతేడాది నా పేరు ముందు రోజే రావడంతో సీఎస్కే సునాయసంగా కొనుగోలు చేయగలిగింది.'అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వచ్చిన దీపక్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.
పంజాబ్ కింగ్స్ రూ. 7.5 కోట్ల వరకు బిడ్ వేసి వెనక్కి తగ్గగా.. చెన్నై 9 కోట్ల వరకు రేసులో నిలిచింది. చివరకు ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో సీఎస్కే.. దీపక్ చాహర్ను రూ. 14 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయగా.. అతను సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయినా తదుపరి సీజన్లో అతనిపై సీఎస్కే నమ్మకం ఉంచి కొనసాగించింది.