ఐపీఎల్ 2025 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 7 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 15 పాయింట్స్తో ఐదో స్థానంలో నిలిచింది. తృటిలో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాన్ని ఢిల్లీ చేజార్చుకుంది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు అందుకొని టేబుల్ టాపర్గా నిలిచిన ఢిల్లీ.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
ప్లే ఆఫ్స్ చేరకపోయినా ఈ సీజన్లో ఢిల్లీ మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే ఈ సీజన్కు స్టార్ ఆటగాళ్లను కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వారిని సరిగ్గా వాడుకోలేకపోయింది. ముఖ్యంగా యార్కర్ల స్పెషలిస్ట్ టీ నటరాజన్ను రూ. 10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. అతన్ని రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఆడించింది. ఈ రెండు మ్యాచ్ల్లో నటరాజన్ 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 18 బంతులేసి రూ.10.75 కోట్లను అందుకున్నాడు. ఒక్కో బంతికి రూ. 60 లక్షలు తీసుకున్నాడు. నటరాజన్ బౌలింగ్ చాలా కాస్ట్లీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పంజాబ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లోనూ నటరాజన్కు అవకాశం దక్కలేదు. నటరాజన్కు బదులు ముఖేష్ కుమార్కు ఢిల్లీ అవకాశాలు ఇచ్చింది. అతను మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. మార్కస్ స్టోయినీస్(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 44 నాటౌట్), జోష్ ఇంగ్లీస్(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) దూకుడుగా ఆడారు.
ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(3/33) మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్(2/38), కుల్దీప్ యాదవ్(2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ముఖేష్ కుమార్కు ఓ వికెట్ దక్కింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 58 నాటౌట్), కరుణ్ నాయర్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 44) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్(2/41) రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ప్రవీన్ దూబే చెరో వికెట్ పడగొట్టారు.