ఐపీఎల్ 2025 సీజన్లో ప్రతీ జట్టు విధ్వంసకర బ్యాటింగ్తో 200 ప్లస్ రన్స్ చేస్తుంటే.. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మాత్రం టీ20ల్లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతోంది. సీఎస్కే బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టు బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమవుతోంది. ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ మెరుగ్గా ఆడటంతో సీఎస్కే గట్టెక్కింది. కానీ ఆర్సీబీ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్ విభాగం మొత్తం చేతులెత్తేసింది. దాంతో 50 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం సీఎస్కే కొంపముంచుతోంది.
సామ్ కరణ్, దీపక్ హుడాలు జట్టుకు భారంగా మారారు. కానీ సీఎస్కే మేనేజ్మెంట్ వారిని తప్పించలేదు. ఎందుకంటే ఆటగాళ్లు విఫలమైనా వరుసగా అవకాశాలు ఇవ్వడం ఆ జట్టు నైజం. కనీసం 10 మ్యాచ్లు అయినా ఆడిస్తారు. అప్పటికీ రాణించకపోతే.. తీవ్ర విమర్శలు వస్తే తప్పా తుది జట్టులో మార్పులు చేయరు. గతంలో కేదార్ జాదవ్ కూడా ఇలానే విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఇప్పుడు దీపక్ హుడా, సామ్ కరణ్, రాహుల్ త్రిపాఠిలు దారుణంగా విఫలమవుతున్నారు. ఫీల్డింగ్లో కూడా తడబడుతున్నారు.

అయితే సీఎస్కే మేనేజ్మెంట్ తమ నిబంధనలను మార్చి.. పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లపై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే సీఎస్కే టైటిల్ గెలవడం దేవుడెరుగు.. కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదని హెచ్చరిస్తున్నారు. ఆర్సీబీతో మ్యాచ్లో జట్టు ఓటమికి కారణమైన సామ్ కరణ్ను తప్పించి డెవాన్ కాన్వేను తీసుకోవాలని సూచిస్తున్నారు. సామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్స్లు బాది మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఈ ఓవర్ కట్టడిగా వేసుంటే ఫలితం మరోలా ఉండేది.
అనంతరం బ్యాటింగ్లోనూ సామ్ కరణ్ విఫలమయ్యాడు. అతని స్థానంలో డెవాన్ కాన్వేను తీసుకుంటే..రుతురాజ్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడని సూచిస్తున్నారు. దీపక్ హుడా స్థానంలో షేక్ రషీద్ లేదా విజయ్ శంకర్ను ఆడించాలని, ధోనీ అప్ది ఆర్డర్ బ్యాటింగ్ రావాలని కోరుతున్నారు.