ఐపీఎల్ 2025 సీజన్ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎప్పటిలానే తమకు అలవాటైన రీతిలోనే మరోసారి తొలి మ్యాచ్ను దేవుడికి ఇచ్చేసింది. గత 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో విజయం సాధించలేదు. అదే సెంటిమెంట్ను ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29), తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31)టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం సీఎస్కే 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 53), రచిన్ రవీంద్ర(44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విజ్ఞేష్ పుతుర్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.

2012లో చివరి విజయం..
ఈ చెత్త రికార్డే ముంబై ఇండియన్స్తో పాటు ఆ జట్టు ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేస్తోంది. చివరిసారిగా ముంబై ఐపీఎల్ 2012 సీజన్లో శుభారంభం చేసింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించింది. ఆ తర్వాత వరుసగా 12 సీజన్లు జరిగినా.. ముంబై ఇండియన్స్ శుభారంభం చేయలేకపోయింది. ఈ 12 సీజన్లలో శుభారంభం చేయకపోయినా.. ముంబై ఐదు టైటిళ్లు గెలిచింది.
2013 సీజన్లో ఆర్సీబీతో తొలి మ్యాచ్లో 2 పరుగులతో ఓడిన ముంబై చివరకు ఛాంపియన్గా నిలిచి తొలి టైటిల్ను అందుకుంది. 2014 సీజన్లో కేకేఆర్తో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన 41 రన్స్తో ఓడిపోయింది. 2015లో మళ్లీ కేకేఆర్తోనే ఫస్ట్ మ్యాచ్ ఆడిన ముంబై.. 7 వికెట్లతో ఓడి.. చివరకు ఛాంపియన్గా నిలిచి రెండో టైటిల్ను కైవసం చేసుకుంది. 2016లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మళ్లీ సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్.. రైజింగ్ పుణె సూపర్ జేయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.
శుభారంభం లేకున్నా 5 టైటిళ్లు..
ఇక 2017, 18, 19, 20, 21, 22, 23 సీజన్లలో కూడా ముంబై శుభారంభాన్ని అందుకోలేదు. కానీ 2017, 19, 20 సీజన్లలో టైటిల్ గెలుచుకొని సత్తా చాటింది. దాంతో తొలి మ్యాచ్ ఓడితే తాము టైటిల్ గెలుస్తామని ముంబై ఫ్యాన్స్ సెంటిమెంట్గా ఫీలయ్యేవారు. కానీ గత నాలుగు సీజన్లుగా ఆ సెంటిమెంట్ రీపిట్ కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
కెప్టెన్ మారినా ముంబై ఇండియన్స్ చెత్త రికార్డ్ కొనసాగుతోంది. గత సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లోనూ ముంబై ఓటమితోనే తమ టైటిల్ వేటను ప్రారంభించింది.