ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో పరాజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సీఎస్కే 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 183 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. నితీష్ రాణాను కట్టడి చేయకపోవడంతో పాటు ఫీల్డింగ్ తప్పిదాలు, ఓపెనర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
అయితే రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్సీ కూడా జట్టు పతనాన్ని శాసించిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ బౌలర్లను సరిగ్గా వాడుకోలేకపోయాడని విమర్శిస్తున్నారు. ఫ్యాన్స్ అన్నట్లుగా.. దూకుడుగా ఆడుతున్న నితీష్ రాణాను కట్టడి చేసే ప్రయత్నం రుతురాజ్ గైక్వాడ్ చేయలేదు.

అశ్విన్తో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించిన రుతురాజ్ గైక్వాడ్.. తమ ప్రధాన స్పిన్నర్, ట్రంప్ కార్డ్ అయిన నూర్ అహ్మద్కు బంతి ఇవ్వలేదు. పవర్ ప్లే అనంతరం ఆలస్యంగా నూర్ అహ్మద్ను తీసుకొని రాగానే.. అతను సంజూ శాంసన్ను ఔట్ చేసి కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు. నితీష్ రాణాను కూడా ఇబ్బంది పెట్టాడు.
అంతేకాకుండా రవీంద్ర జడేజాకు 13వ ఓవర్ వరకు బౌలింగ్ ఇవ్వలేదు. లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన నితీష్ రాణా దూకుడుగా ఆడటంతో జడేజాను ఆలస్యంగా బౌలింగ్ తీసుకొచ్చాడు. సీఎస్కే స్పిన్నర్లు నూర్ అహ్మద్, అశ్విన్ 4 ఓవర్లు వేస్తే జడేజాతో రెండు ఓవర్లు మాత్రమే వేయించాడు. పవర్ ప్లేలో ధారళంగా పరుగులిస్తున్న ఖలీల్ అహ్మద్ను ఆపకుండా అతనితోనే బౌలింగ్ చేయించాడు. ఇది జట్టుకు తీవ్ర నష్టం చేసింది.
రుతురాజ్ గైక్వాడ్ టీమ్ మేనేజ్మెంట్ ఇచ్చే సూచనలను మాత్రమే పాటిస్తున్నట్లు అర్థమవుతోంది. అంతేతప్పా.. అప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లు అతను నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. అతని కెప్టెన్సీ మారకపోతే చెన్నై సూపర్ కింగ్స్కు మరిన్ని కష్టాలు తప్పవు.