చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్కు సంబంధించిన వార్తలను ఆ జట్టు హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ కొట్టిపారేసాడు. ధోనీ తన ఆటను కొనసాగిస్తాడని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్కు ముందు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్కు ధోనీ తల్లిదండ్రులు హాజరవ్వడంతో ఏదో ప్రత్యేకమైన కారణం ఉందని అంతా భావించారు. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకున్నారు. కానీ ధోనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన స్టీఫెన్ ఫ్లెమింగ్ను ధోనీ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా.. అతను కొట్టిపారేసాడు. ధోనీ ఆటలో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. 'ధోనీ ప్రస్తుతం బలంగా ఉన్నాడు. భవిష్యత్తు గురించి అతన్ని నేను ఏం అడుగను. ధోనీ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి నాకు ఏం తెలియదు. అతనితో పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నాను.'అని స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 25 పరుగుల తేడాతో చిత్తయ్యింది. చెన్నైకి ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం. 15 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. అభిషేక్ పోరెల్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33), ట్రిస్టన్ స్టబ్స్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/25) రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసి ఓటమిపాలైంది. విజయ్ శంకర్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. ధోనీ(26 బంతుల్లో ఫోర్, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్(2/27) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.