ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్ మినహా.. అన్ని మ్యాచ్ల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. తుది జట్టు మార్పులు చేసినా.. కెప్టెన్ను మార్చినా చెన్నై సూపర్ కింగ్స్ తలరాత అయితే మారడం లేదు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్య బాధ్యతలు చేపట్టినా సీఎస్కేకు ఓటమి తప్పలేదు. కోల్కతా నైట్రైడర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే చెత్త బ్యాటింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. శివమ్ దూబే(31 నాటౌట్), విజయ్ శంకర్(29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం కేకేఆర్ 10.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 107 పరుగులు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ధోనీ 4 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ వికెట్ నిర్ణయం వివాదాస్పదమైంది.

వరుస పరాజయాలతో చతికల పడిన చెన్నై సూపర్ కింగ్స్పై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి పూజ ఎక్కువైతే ఫలితాలు ఇలానే ఉంటాయని మండిపడుతున్నారు. జట్టు ప్రదర్శన కంటే ధోనీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారని, అతిగా పొగుడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కామెంటేటర్లు అయితే మరీ అతి చేస్తున్నారని, కూచుంటే ధోనీ, నిలబడితే ధోనీ అన్నట్లు మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ధోనీ ఆట కంటే వారి పీఆర్ల డబ్బా ఎక్కువైందని, ధోనీకి ఎలివేషన్స్ ఇవ్వడం ఆపేయాలని సలహా ఇస్తున్నారు. వ్యక్తి పూజ ఎక్కువైతే జట్టులోని ఇతన ఆటగాళ్ల ప్రదర్శనకు సరైన గుర్తింపు దక్కదని, జట్టులోని ప్రతిభను అణచి వేయడానికి కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అని, అందరూ రాణిస్తేనే విజయాలు దక్కుతాయని, ఒక్క ఆటగాడి ప్రదర్శనతో విజయాలు సాధించలేమని హితవు పలుకుతున్నారు. ధోనీ తీరు 'బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ' అన్నట్లు తయారైందని విమర్శలు గుప్పిస్తున్నారు.