ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా వ్యాఖ్యాత డానీ మోరిసన్ ధోనీని ఉద్దేశించి కీలక ప్రశ్న అడిగాడు. టాస్ ఓడిన తర్వాత ధోనీతో మోరిసన్ మాట్లాడుతుండగా.. మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులు గట్టిగా అరిచారు. దాంతో మోరిసన్.. వచ్చే సీజన్ కూడా ధోనీ ఆడాలని వారు కోరుకుంటున్నారని చెప్పాడు. దానికి ధోనీ బదులిస్తూ.. 'నేనసలు తర్వాతి మ్యాచ్లో ఆడుతానో లేదో తెలియట్లేదు'అని నవ్వుతూ చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు ధోనీ సిద్దమయ్యాడా? అనే చర్చ ఊపందుకుంది. ఈ సీజన్లో ధోనీ మొకాలి నొప్పితో బాధపడుతూనే జట్టులో కొనసాగుతున్నాడు. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే అధికారికంగా తప్పుకోవడంతో.. తుది జట్టు నుంచి ధోనీ తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం సీఎస్కే వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బరోడా ప్లేయర్ ఉర్విల్ పటేల్ను సీఎస్కే మేనేజ్మెంట్ ట్రయల్స్కు ఆహ్వానించినట్లు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తెలిపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ఎంపికైన అతనికి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఉర్విల్ పటేల్ అన్సోల్డ్గా నిలిచాడు.
ధోనీ స్థానాన్ని ఉర్విల్ పటేల్తో భర్తీ చేయాలని సీఎస్కే భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో డెవాన్ కాన్వే, వంశ్ బేడీల రూపంలో బ్యాకప్ వికెట్ కీపర్స్ ఉన్నారు. అయినా ఉర్విల్ పటేల్ను ట్రయల్స్కు ఆహ్వానించడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత సీఎస్కే ఇంత దారుణంగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే కుర్రాళ్లకు బదులు అనుభవం కలిగిన ఆటగాళ్లను కొనుగోలు చేయడమే జట్టు కొంపముంచిందని సీఎస్కే మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరి నాలుగు మ్యాచ్ల్లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.