చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడుతున్న ధోనీ.. మునపటిలా ఆడటం లేదని సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అప్పటి నుంచి ప్రతీ సీజన్కు ముందు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరిగింది. కానీ ధోనీ ఏదో కారణం చెబుతూ.. రిటైర్మెంట్పై స్పష్టత ఇవ్వకుండా తన ఆటను కొనసాగించాడు.
మునపటిలా బ్యాటింగ్ చేయలేకపోతున్నా.. తనదైన కీపింగ్తో అదరగొడుతున్నాడు. కళ్లు చెదిరే స్టంపౌట్, క్యాచ్లతో ఔరా అనిపిస్తున్నాడు. వికెట్ల వెనుకాల బౌలర్లకు పెద్దన్నలా వ్యవహరిస్తూ కీలక సలహాలు ఇస్తున్నాడు. కానీ ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ధోనీ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు జట్టులో ధోనీ ఎందుకు ఉన్నాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధోనీ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకే సీఎస్కే అతన్ని జట్టులో కొనసాగిస్తుందా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.

ఈ మ్యాచ్లో ఆర్సీబీ 196 పరుగుల భారీ స్కోర్ చేయగా.. సీఎస్కే 146 పరుగులకే పరిమితమై 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఓపెనర్లు, మిడిలార్డ్ విఫలమవడంతో ధోనీ ముందుగానే బ్యాటింగ్కు వస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి డిఫెన్స్ ఆడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్లో తొలి రెండు వికెట్లు కోల్పోగానే.. సీఎస్కే చేతులెత్తేయడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. గతంలో అప్ది ఆర్డర్ వచ్చి.. తనదైన శైలిలో ధోనీ ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. కానీ ఆర్సీబీతో మ్యాచ్లో లేటుగా వచ్చిన ధోనీ.. డిఫెన్స్ ఆడుతూ.. టైంపాస్కు బ్యాటింగ్ చేస్తున్నట్లు ఆడాడు. చివరి ఓవర్లో భారీ సిక్స్లు బాదినప్పటికీ.. అతని అప్రోచ్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ క్రమంలోనే ధోనీ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు మాత్రమే సీఎస్కే అతన్ని జట్టులో కొనసాగిస్తుందనే విషయం తాజా మ్యాచ్తో స్పష్టమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ధోనీ క్రేజ్ను ఉపయోగించుకొని హైప్ క్రియేట్ చేసి.. సీఎస్కే టికెట్స్ అమ్ముకుంటుందని ఆరోపిస్తున్నారు. ధోనీ ఆడటం వెనుక సీఎస్కే కాసుల కక్కుర్తి ఉందని మండిపడుతున్నారు. ఇంకా ధోనీని వెనుకేసుకొచ్చే అభిమానులు ఉంటే.. వారు గుడ్డి ఫ్యాన్స్ అని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే.. నోటిస్ పీరియడ్లో ఉన్న ఉద్యోగికి.. రిటైర్మెంట్ దగ్గర పడిన క్రికెటర్కు టార్గెట్స్తో పని ఉండదని సెటైర్లు పేల్చుతున్నారు.