ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కీలక డబుల్ హెడర్కు సిద్దమయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లను ఈ రోజు(ఆదివారం) ఆడుతున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది.
పంజాబ్ జోరు కొనసాగేనా..?
ఈ సీజన్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్ కింగ్స్.. 11 మ్యాచ్ల్లో 7 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 15 పాయింట్స్తో ప్లే ఆఫ్స్ దిశగా సాగుతోంది. రాజస్థాన్ రాయల్స్తో విజయం సాధిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. ఓడితే మాత్రం తదుపరి రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్లో ఉన్నారు.

గాయపడిన ఫెర్గూసన్ స్థానంలో జేమీసన్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసుకు దూరమై రాజస్థాన్ రాయల్స్.. చివరి రెండు మ్యాచ్లు గెలిచి గౌరవంగా టోర్నీని ముగించాలని భావిస్తోంది. సంజూ శాంసన్ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. సంజూ తిరిగొచ్చినా.. వైభవ్ సూర్యవంశీ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ఉక్కపోత, వేడి ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించనుంది. ఈ మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.
ఢిల్లీకి చావో రేవో..
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్కు చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్లో ఓడితే ఢిల్లీ ప్లే ఆఫ్ష్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. 11 మ్యాచ్ల్లో 13 పాయింట్స్తో ఉన్న ఢిల్లీ.. చివరి మూడు మ్యాచ్లకు మూడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం రెండు మ్యాచ్లు అయినా గెలవాలి. మరోవైపు 11 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించిన గుజరాత్ మరో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఐపీఎల్కు విరామం రావడంతో స్వదేశం వెళ్లిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ తిరిగి భారత్కు రావద్దని నిర్ణయించుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్కు పెద్ద ఎదురుదెబ్బ. ఈ సీజన్లో ఆ జట్టు తరఫున ఉత్తమ బౌలర్ అతనే. 14 వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.