సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన అనూహ్య ఓటమితో బాధలో ఉన్న పంజాబ్ కింగ్స్కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ గాయంతో ఐపీఎల్ 2025 సీజన్ మొత్తాని దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత శనివారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో లాకీ ఫెర్గూసన్ రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసి తీవ్రమైన కాలి నొప్పితో మైదానం వీడాడు. ఎడమ తొడ భాగాన్ని చేతితో పట్టుకొని కనిపించాడు. అతని తొడ కండరాల్లో గాయమైనట్లు తెలుస్తోంది.
అతని గైర్హాజరీ పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఫెర్గూసన్ గైర్హాజరీలో సన్రైజర్స్ హైదరాబాద్ 246 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయాన్నందుకుంది. లాకీ ఫెర్గూసన్ గాయంతో దూరమవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. అవసరమైనప్పుడల్లా వికెట్ తీసే బౌలరని చెప్పుకొచ్చాడు.

కోల్కతా నైట్రైడర్స్తో ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మంగళవారం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్.. లాకీ ఫెర్గూసన్ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, విశ్రాంతి అవసరమని చెప్పాడు. అతను టోర్నీ ముగిసే సమయానికి కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాడు.
ఈ సీజన్లో ఫెర్గూసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 4 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీసాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పంజాబ్కు కీలక బౌలర్గా మారాడు. అతని గైర్హాజరీ పంజాబ్ కింగ్స్కు తీవ్ర నష్టం చేయనుంది. అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ ఎవరినీ తీసుకుంటుందో చూడాలి. అయితే ఫెర్గూసన్ దూరమవ్వడంపై పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.