ఐపీఎల్ 2025 సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకొని ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఎన్సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
అయితే అతను ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నాడని ఎన్సీఏ వర్గాలు పేర్కొన్నాయి. బుమ్రా ప్రాక్టీస్ను బీసీసీఐ మెడికల్ టీమ్ దగ్గరుండి పర్యవేక్షిస్తుందని, ప్రాక్టీస్ సమయంలో ఎలాంటి ఫ్రాక్చర్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఒకేసారి కాకుండా క్రమక్రమంగా బుమ్రా వర్క్ లోడ్ పెంచుతున్నట్లు సమాచారం. బుమ్రా పూర్తిగా కోలుకునేందుకు మరో 2 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సంచలన ప్రదర్శన కనబర్చిన బుమ్రా.. ఆఖరి మ్యాచ్లో గాయపడిన విషయం తెలిసిందే. అతని వెన్ను గాయం తిరగబెట్టడంతో మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. దాంతో అతను రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా బుమ్రా దూరమయ్యాడు.
ఐపీఎల్ అనంతరం టీమిండియా.. ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ నేపథ్యంలో బుమ్రా గాయాన్ని బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు అర్థమవుతోంది. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే ఐపీఎల్ ఆడేందుకు బుమ్రాకు క్లియరెన్స్ ఇవ్వనుంది. లేకుంటే అతను ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు ఘోర పరాజయాల తర్వాత అద్భుత విజయాన్నందుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. అశ్వని కుమార్ సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్తో శుక్రవారం ఆడనుంది.