సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్పై ఆ జట్టు మాజీ పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమె చాలా మంచిదని, ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా నిలిచేదని తెలిపాడు. ఐపీఎల్ 2014 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ వరకు మొత్తం 11 ఏళ్ల పాటు ఆరెంజ్ ఆర్మీకి ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ తాజా సీజన్లో ఆర్సీబీకి ఆడుతున్నాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును వీడటంపై అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. 11 సీజన్ల పాటు ఆ జట్టుకు ఆడి.. ఆర్సీబీలోకి రావడం కొంచెం కష్టంగానే ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ గురించి భువీ మాట్లాడిన ఓ పాత వీడియోను ఆరెంజ్ ఈర్మీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో కావ్య మారన్ను భువనేశ్వర్ కుమార్ ఆకాశానికెత్తాడు.

జట్టు ప్రదర్శనతో కావ్య మారన్ తీవ్ర బాధకు గురైనా, కలత చెందినా ఏ రోజు కూడా ఆటగాళ్లను ఒక్క మాట అనలేదని తెలిపాడు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా.. ఏ రోజు కూడా టీమ్ సెలెక్షన్, ఆన్ ఫీల్డ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్నాడు.
'కావ్యమారన్ జట్టు ఓనర్. ఆమె ఈ జట్టు కోసం ఎంతో పెట్టుబడి పెట్టారు. వరుస పరాజయాలు ఎదురైతే ఆటగాళ్లలానే ఓనర్ కూడా ఎంతో మానసిక వేదనకు గురవుతారు. కానీ ఏ రోజు కావ్య మారన్ ఒక్క ఆటగాడిని కూడా ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రశ్నించలేదు. కోచ్ల పనితీరును తప్పుబట్టలేదు. మేం బాగా ఆడకపోయినా.. మాకు అండగానే నిలిచింది.'అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో పాపులారిటీ కలిగిన జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఆ జట్టు విధ్వంసకర బ్యాటింగ్తో పాటు ఓనర్ కావ్య మారన్ తీరు సన్రైజర్స్ హైదరాబాద్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఐపీఎల్ 2016 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యవహారాలను చూస్తున్న కావ్య మారన్.. ప్రతీ సీజన్లో తమ జట్టు ఆడే మ్యాచ్లకు హాజరై సందడి చేస్తోంది. మెగా వేలంలోనూ తెలివిగా వ్యవహరించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తోంది. కావ్య మారన్ కోసమే మ్యాచ్లకు వచ్చే ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది. వరుసగా 4 పరాజయాల తర్వాత పంజాబ్ కింగ్స్పై అదిరిపోయే విజయాన్నందుకుంది. తమ తదుపరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో గురువారం ఆడనుంది.