టీమిండియా వెటరన్ పేసర్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్తో పోటీ పడి మరి రూ. 10.75 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వెటరన్ పేసర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తగ్గేదేలే అన్నట్లు బిడ్ వేసారు. దాంతో భువనేశ్వర్ కుమార్ ధర అమాంతం రూ. 10 కోట్లకు చేరింది. రూ. 10.50 కోట్లకు లక్నో ఆఖరి బిడ్ వేయగా.. ముంబై తప్పుకుంది. లక్నో ఖాయమనే సమయంలో ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ.. రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది.

ఆఖరి వరకు వేచి చూసిన ఆర్సీబీ తెలివిగా వ్యవహరించి సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్.. 176 మ్యాచ్లు ఆడి 181 వికెట్లు తీసాడు. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న భువీకి అపారమైన అనుభవం ఉంది. నకుల్ బాల్స్, యార్కర్లు, స్లోయర్ బాల్స్ వేయడంలో భువనేశ్వర్ కుమార్ స్పెషలిస్ట్. డెత్, పవర్ ప్లే బౌలింగ్ స్పెషలిస్ట్గా టీమిండియాతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్కు భువీ ఎన్నో విజయాలు అందించాడు.
బెంగళూరు హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియానికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుంది. చిన్నమైదానంలో భువీ స్లో బౌలింగ్ పరుగులు కట్టడి చేయడానికి ఉపయోగపడనుంది. ఈ క్రమంలోనే భువీ కోసం ఆర్సీబీ భారీ ధర చెల్లించింది. భువనేశ్వర్ కుమార్ను కొనుగోలు చేయడంపై ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
జోష్ హేజిల్వుడ్ (రూ. 12.50 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు), జితేశ్ శర్మ (రూ. 11 కోట్లు), లివింగ్స్టన్ (రూ. 8.75 కోట్లు), రసిక్ సలాం (రూ. 6 కోట్లు), సుయాష్ శర్మ (రూ. 2.60 కోట్లు), కృనాల్ పాండ్యా(రూ.5.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ.10.75 కోట్లు)