ఐపీఎల్ 2025 సీజన్కు ముందు నిర్వహించే మెగా వేలంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిన బీసీసీఐ.. రిటెన్షన్ పాలసీ రూపొందించడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకున్నది.
అయితే రిటెన్షన్ పాలసీని ప్రకటించేందుకు బీసీసీఐ సమయం తీసుకుంటున్నది. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ప్రతీ జట్టుకు నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్తో పాటు రెండు ఆర్టీఎమ్(రైట్ టు మ్యాచ్) కార్డ్స్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో అనామక ఆటగాళ్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

మొత్తంగా ప్రస్తుత జట్టులో ఉన్న ఆరుగురు ఆటగాళ్లను ప్రతీ జట్టు అంటిపెట్టుకోవచ్చు. నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే.. మరో ఇద్దరిని వేలంలో ఆర్టీఎమ్ కింద తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఈ నిర్ణయం ప్రస్తుత జట్ల ప్రధాన ఆటగాళ్లను కొనసాగించేందుకు ఉపయోగపడనుంది. మెజార్టీ ఫ్రాంచైజీల డిమాండ్కే బీసీసీఐ కట్టుబడినట్లు తెలుస్తోంది.
అయితే ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కానీ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ఆప్షన్కే మెజార్టీ ఫ్రాంచైజీలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అలాకాకుంటే ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్తో పాటు మూడు ఆర్టీఎమ్ కార్డ్స్ ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీసీసీఐ నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్తో పాటు రెండు ఆర్టీఎమ్ కార్డ్స్ ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు.
రిటెన్షన్ ప్రక్రియలో ఆయా జట్లు తమ మార్క్యూ ఆటగాళ్లతో పాటు ఎమర్జింగ్ స్టార్స్, అనామక ప్లేయర్లను కూడా భాగం చేయాల్సి ఉంటుంది. అతి త్వరలోనే బీసీసీఐ ఐపీఎల్ 2025 రిటెన్షన్ పాలసీ గురించి అధికారిక ప్రకటన చేయనుంది. వచ్చే నెల తొలి రెండు వారాల్లోపు రిటెన్షన్ పాలసీపై అధికారిక ప్రకటన రావచ్చు.
4+2 రిటెన్షన్ విధానం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్లకు కలిసి రానుంది. తమ కోర్ ఆటగాళ్లందరిని ఈ ఐదు టీమ్స్ అంటిపెట్టుకుంటాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కూడా ఈ విధానంతో పెద్దగా వచ్చే నష్టం లేదు. కానీ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా నష్టపోనున్నాయి.
సరైన టీమ్ కాంబినేషన్ లేకుండా బాధపడుతున్న ఈ రెండు జట్లు మెగా వేలం ద్వారా అయినా తమ జట్లను మెరుగుపరుచుకోవాలని భావించాయి. కానీ బీసీసీఐ ఆరుగురు ఆటగాళ్ల రిటెన్షన్కు అనుమతిస్తుండటంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.