ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్థాన్ మిస్సైల్స్తో దాడులు చేస్తోంది. ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్ను అర్థాంతరంగా రద్దు చేశారు.
ముందుగా ఫ్లడ్ లైట్స్ను ఆపేసి ప్రేక్షకులను బయటకు పంపించారు. ఆ తర్వాత ఆటగాళ్లను స్టేడియం నుంచి తరలించారు. ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కలికంగా మూసివేయడంతో పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను అక్కడి నుంచి ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేకమైన రైలును ఏర్పాటు చేసింది.

ధర్మశాల స్టేడియానికి సమీపంగా ఉన్న ఉనా రైల్వే స్టేషన్కు ఈ స్పెషల్ ట్రైన్ను తీసుకొచ్చినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అఫిషియల్స్, బ్రాడ్ కాస్టింగ్ సిబ్బంది ఈ ట్రైన్లోనే ఢిల్లీకి రానున్నారు. పరిస్థితుల బాలేకపోవడంతోనే మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చిందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఇండియా టుడేతో అన్నారు.
ఆటగాళ్లు, ప్రేక్షకులు, సపోర్ట్ స్టాఫ్ భద్రత తమ ప్రాధాన్యత అని, దేశానికి మేలు చేసే ఏ పనైనా చేయడానికి తాము సిద్దమని చెప్పారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, త్వరలోనే ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.