ఐపీఎల్ 2025 సీజన్లో హ్యాట్రిక్ విజయాలు దక్కుతాయని తాను అస్సలు ఊహించలేదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది వరుసగా మూడో విజయం. మ్యాచ్ అనంతరం తమ వరుస విజయాలపై అక్షర్ పటేల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంత సునాయసంగా హ్యాట్రిక్ విజయాలు అందుకుంటామని తాము అస్సలు ఊహించలేదన్నాడు. సమష్టి ప్రదర్శనతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డాడు.
'ఇంత సునాయసంగా హ్యాట్రిక్ విజయాలు సాధిస్తామని అస్సలు ఊహించలేదు. జట్టులో ప్రతీ ఒక్కరు ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జట్టు సమతూకంగా ఉంది. కెప్టెన్గా మూడు మ్యాచ్లకు మూడు గెలవడం చాలా సంతోషంగా ఉంది. జట్టు సమావేశంలో జరిగే చర్చలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నన్ను నేను రక్షించుకునేందుకే ఈ రోజు నేను ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. నా చేతి వేలికి గాయమైంది. నాకు బౌలింగ్ చేయాలనిపించింది. కానీ ఇది సుదీర్ఘమైన టోర్నీ కావడంతో రిస్క్ తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్లో కొన్ని మంచి క్యాచ్లతో పాటు చేజార్చిన క్యాచ్లు ఉంటాయి. ఇంకా మేం సరైన మ్యాచ్ ఆడలేదు. మేం మంచి ఆరంభం అందుకున్నాం. కానీ ఐపీఎల్ సుదీర్ఘమైన టోర్నీ. మూమెంటమ్ ఎప్పుడైన మారవచ్చు.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

15 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆ జట్టు చివరి సారిగా ఐపీఎల్ 2010 సీజన్లో చెపాక్ మైదానంలో గెలుపొందింది. గత 16 ఏళ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. అభిషేక్ పోరెల్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33), ట్రిస్టన్ స్టబ్స్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/25) రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసి ఓటమిపాలైంది. విజయ్ శంకర్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. ధోనీ(26 బంతుల్లో ఫోర్, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్(2/27) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.