మిచెల్ స్టార్క్ సంచలన ప్రదర్శనతోనే విజయం సాధించామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఢిల్లీకి ఇది వరుసగా రెండో విజయం. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. ప్రణాళికలకు తగ్గట్లు రాణించి విజయం సాధించామని తెలిపాడు. పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్తో అదనంగా మరో ఓవర్ వేయించడం తమకు కలిసొచ్చిందని చెప్పాడు.
ఆ ఎక్స్ట్రా ఓవర్..
'నేను ముందుగా చెప్పినట్లు ఈ జట్టును ఒకే పద్దతిలో నడిపిస్తాను. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్ కీలకమే. 10 అత్యుత్తమ జట్లు ఆడుతున్నాయి కాబట్టి ఏ మ్యాచ్ను తేలికగా తీసుకోలేం. మేం మా ప్రణాళికలు, విధానంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేం మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశాం. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం మిచెల్ స్టార్క్కు పవర్ ప్లేలో రెండు ఓవర్లు.. చివర్లో మరో రెండు ఓవర్లు ఇవ్వాలనుకున్నాను. కానీ అతను మంచి రిథమ్లో కనిపించడంతో పవర్ ప్లేలోనే మరో ఓవర్ వేయించాను. ఆ ఓవర్లో అతను కీలమైన ట్రావిస్ హెడ్ను ఔట్ చేశాడు.

వారి సలహాలు పాటిస్తున్నా..
మా జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారు నాకు సలహాలు ఇస్తున్నారు. కొన్నిసార్లు నేను వాటిని పాటిస్తున్నాను. వారితో ఆటను ఆస్వాదిస్తున్నాను. ఫిరోజ్షా కోట్లా మైదానంలో చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నాం. అక్కడ కూడా మేం ఈ తరహా ప్రణాళికలతోనే బరిలోకి దిగుతాం. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులను అంచనా వేయాలి.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. వైజాగ్ వేదికగా రెండు మ్యాచ్లు ముగియడంతో ఢిల్లీ క్యాపిటల్స్.. మిగతా మ్యాచ్లను తమ హోమ్ గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆడనుంది.
దెబ్బతీసిన స్టార్క్..
ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్(5/35) ఐదు వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. పవర్ ప్లేలోనే డేంజరస్ ఇషాన్ కిషన్(2), నితీష్ కుమార్ రెడ్డి(0)తో పాటు ట్రావిస్ హెడ్(22)లను ఔట్ చేసిన స్టార్క్..చివర్లో హర్షల్ పటేల్, ఇంపాక్ట్ ప్లేయర్ అయిన వియాన్ మల్డర్(9)ను పెవిలియన్ చేర్చాడు. తాను వేసిన తొలి ఓవర్లో అభిషేక్ శర్మ(1) రనౌటవ్వగా.. రెండో ఓవర్లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వెనుదిరిగారు. పవర్ ప్లేలో అదనంగా వేసిన ఓవర్లో డేంజరస్ ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. దాంతో సన్రైజర్స్ కోలుకోలేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 74) ఒంటరి పోరాటం చేయగా.. హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32) పర్వాలేదనిపించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే 3 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.