ఐపీఎల్ 2025 మెగా వేలం అంచనాలకు మించి జరుగుతోంది. మార్క్యూ ప్లేయర్ల జాబితాతో వేలం ప్రారంభం కావడంతో స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కురిపిస్తున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరక పలికిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. రూ. 26.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో అతను మిచెల్ స్టార్క్ అత్యధిక ధరను అధిగమించాడు. మిచెల్ స్టార్క్ గత సీజన్ మినీ వేలంలో రూ. 24.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అయితే తాజా వేలంలో శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు పలికి ఆ రికార్డ్ను అధిగమించాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.

ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ నయా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తగ్గేదేలే అన్న రీతిలో బిడ్డింగ్ వేసాడు. తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్పై పై చేయి సాధించాడు. గత సీజన్ వరకు పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్కు హెడ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కూడా అయ్యర్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ బడ్జెట్ దృష్ట్యా ముందడుగు వేయలేకపోయింది.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ పాత ఫ్రాంచైజీ కేకేఆర్.. అతని కోసం రూ. 10 కోట్ల వరకు బిడ్ వేసింది. అయ్యర్ ధర అమాతం పెరగడంతో వెనకడుగు వేసింది. గత సీజన్లో కేకేఆర్కు కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ టీమ్ రిటెన్షన్కు అతను అంగీకరించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ ఆఫర్తో అయ్యర్ను అప్రోచ్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ వేలంలో అయ్యర్ను పంజాబ్ కింగ్స్ రికార్డ్ ధరకు సొంతం చేసుకుంది.
రూ. 26.75 కోట్లకు అయ్యర్ను కొనుగోలు చేసిన పంజాబ్.. అతనికే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ జట్టు అర్ష్దీప్ సింగ్ను రూ. 18 కోట్లకు ఆర్టీఎమ్ ద్వారా కొనుగోలు చేసింది.
IPL 2025 మెగా వేలం హైలైట్స్
అర్ష్దీప్ సింగ్-రూ. 18 కోట్లు(పంజాబ్ కింగ్స్-ఆర్టీఎమ్)
కగిసో రబడా-రూ. 10.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
శ్రేయస్ అయ్యర్-రూ. 26.75 కోట్లు(పంజాబ్ కింగ్స్)
జోస్ బట్లర్-రూ.15.75 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
మిచెల్ స్టార్క్-రూ.11.75 కోట్లు(ఢిల్లీ క్యాపిటల్స్)