రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) రూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మళ్లీ ప్రవేశ పెట్టింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ప్రతీ జట్టు ఒక ఆల్టీఎమ్ కార్డ్ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుండగా.. ఇందుకు సంబంధించిన రిటెన్షన్ పాలసీని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఖరారు చేసింది.
ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డ్ ఉంది. అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతీ జట్టు పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ఆటగాళ్లందరికీ ప్రతీ మ్యాచ్కు రూ. 7.50 లక్షల మ్యాచ్ ఫీజు అందించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

అన్నీ లీగ్ మ్యాచ్లు ఆడిన ఆటగాడికి అదనంగా రూ. 1.05 కోట్ల ఆదాయం లభిస్తోంది. ప్రతీ ఫ్రాంచైజీ ఈ ఫీజు కోసం రూ. 12.60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పర్స్ వాల్యూకు ఇది అదనం.
రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఈ డబ్బుతోనే ఆర్టీఎమ్తో పాటు 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్ను పక్కనపెట్టిన బీసీసీఐ.. ఈసారి మాత్రం అనుమతిచ్చింది. అయితే ఈ రూల్ కారణంగా ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారనే అశ్విన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిబంధనను కాస్త మార్చింది. ఆటగాళ్లకు లాభం చేకూర్చేలా ఆర్టీఎమ్ రూల్ను ట్విస్ట్ చేసింది.
రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) అంటే ఏమిటీ..?
మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా ఒకరిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే గతంలో ఈ రూల్ ప్రకారం.. ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ వేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది. కానీ ఈ సారి బీసీసీఐ ఈ రూల్ను మార్చింది. బిడ్ వేసిన టీమ్కు సదరు ప్లేయర్ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది. అప్పుడు ఆ ఆ ధరను చెల్లిస్తేనే ఆర్టీఎమ్ కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.
ఉదాహరణకు సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ట్రావిస్ హెడ్ను ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. వేలంలో ఆర్సీబీ అతని కోసం రూ. 12 కోట్ల వరకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆర్టీఎమ్ కార్డుతో ట్రావిస్ హెడ్ను తీసుకోవాలనుకుంది. పాత రూల్ ప్రకారం రూ. 12 కోట్లు చెల్లించి తీసుకోవచ్చు. కానీ బీసీసీఐ నయా రూల్ ప్రకారం ఆర్సీబీ మరోసారి బిడ్ వేయవచ్చు. అప్పుడు ఆర్సీబీ 13 కోట్లకు బిడ్ వేస్తే.. సన్రైజర్స్ ఆ డబ్బులను చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి దక్కుతాడు.