యువ బ్యాటర్ విప్రజ్ నిగమ్ సహకారంతోనే విజయలాంఛనాన్ని పూర్తి చేశానని ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ అశుతోష్ శర్మ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో అశుతోష్ శర్మ (31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 66 నాటౌట్) సంచలన బ్యాటింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించాడు.
113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన జట్టును విప్రజ్ నిగమ్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), కుల్దీప్ యాదవ్(5), మోహిత్ శర్మ(1 నాటౌట్) సాయంతో విజేతగా నిలబెట్టాడు. భారీ సిక్సర్లతో చెలరేగిన అశుతోష్ శర్మ..విన్నింగ్ షాట్తోనే ఢిల్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో ఈ సీజన్కే ఈ మ్యాచ్ హైలైట్గా నిలిచిపోయింది. ఈ సంచలన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న అషుతోష్.. ఆ అవార్డ్ను తన మెంటార్ శిఖర్ ధావన్కు అంకితం ఇచ్చాడు.

'గత సీజన్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గత సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో నేను అద్భుతంగా ఆడినా.. విజయలాంఛనాన్ని పూర్తి చేయలేదు. దాంతో మ్యాచ్లను ముగించడంపై ప్రత్యేకమైన దృష్టి సారించాను. దేశవాళీ క్రికెట్లోనూ మ్యాచ్లను ముగించడంపైనే ఫోకస్ పెట్టాను. చివరి ఓవర్ చివరి బంతి వరకు క్రీజులో ఉంటే ఏదైనా జరగవచ్చని నేను గట్టిగా నమ్మాను. ప్రశాంతంగా ఉంటూ.. నాపై నేను నమ్మకం ఉంచుతూ.. సాధన చేసిన షాట్లను ఆడాను.
విప్రజ్ నిగమ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని కనెక్ట్ చేయగలిగితే.. హిట్టింగ్ చేయాలని చెప్పాను. నేను ప్రశాంతంగా ఉంటూ.. ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా ఆడాను. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను నా గురువు శిఖర్ పాజీకి అంకితం చేయాలనుకుంటున్నాను.'అని అశుతోష్ శర్మ చెప్పుకొచ్చాడు.