ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్తో ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన లక్నో 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది.
స్వింగ్ కింగ్ అర్ష్దీప్ సింగ్(3/16) మూడు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించాడు. అర్ష్దీప్ సింగ్ ధాటికి లక్నో.. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది.

ప్రభ్సిమ్రాన్ సింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో శశాంక్ సింగ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్(2/30), దిగ్వేష్ రతి(2/46) రెండేసి వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసింది. ఆయుష్ బదోని(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 74), అబ్దుల్ సమద్(24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45) పోరాడినా ఫలితం లేకపోయింది. అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీసాడు. మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంజాబ్.. ధర్మశాలలో విజయం సాధించింది. అంతేకాకుండా గత 11 ఏళ్లలో ఓ సీజన్లో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్స్ సాధించడం ఇదే తొలిసారి. మరో విజయం సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది. ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వల్లే సాధ్యమైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు లక్నో 11 మ్యాచ్ల్లో 6 ఓడి ప్లే అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి మూడు మ్యాచ్లకు మూడు గెలిస్తేనే ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయగలదు.