సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బంపరాఫర్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)తో నెలకొన్న వివాదం నేపథ్యంలో తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించింది. ఈ సీజన్లోని మిగతా మ్యాచ్లను వైజాగ్ వేదికగా నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని, అద్దె కూడా తీసుకోబోమని సన్రైజర్స్ హైదరాబాద్కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కూడా సన్రైజర్స్ మేనేజ్మెంట్కు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఐపీఎల్ 2025 సీజన్ ఫ్రీ పాసుల నేపథ్యంలో హెచ్సీఏతో సన్రైజర్స్ హైదరాబాద్కు విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. పాసుల విషయంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమను వేధిస్తున్నాడని, బెదింపులకు పాల్పడుతున్నాడని సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజర్ శ్రీనాథ్.. హెచ్సీఏ సెక్రటరీ సీజే శ్రీనివాస్కు చేసిన మెయిల్ కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

సీఎం జోక్యంతో సన్రైజర్స్ హైదరాబాద్తో చర్చలు జరిపిన హెచ్సీఏ గొడవకు తెరదించింది. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇచ్చేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది. గతంలోలాగే అన్ని కేటగిరిల్లో 10 శాతం పాసులు కేటాయించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విన్నపానికి ఒకే చెప్పింది.
పాసుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చిందని, గొడవ సద్దుమణిగిందని హెచ్సీఏ-సన్రైజర్స్ హైదరాబాద్ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. కానీ తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.. తమ రాష్ట్రానికి హెచ్సీఏ రావాలని కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానించినా.. సన్రైజర్స్ హైదరాబాద్ వెళ్లలేదు. హైదరాబాద్ బేస్ ఫ్రాంచైజీగా ఉన్న సన్రైజర్స్ ఈ నిర్ణయం తీసుకోవాలంటే బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
గతంలో వైజాగ్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరిగేవి. రాష్ట్ర విభజన తర్వాత సన్రైజర్స్.. హైదరాబాద్కే పరిమితమైంది. ఐపీఎల్ టీమ్ విషయంలో ఆంధ్ర ప్రభుత్వం చాలా ఆసక్తి చూపిస్తోంది. ఎలాగైనా తమ రాష్ట్రానికి ఐపీఎల్ జట్టు తీసుకురావాలనే పట్టుదలతో ఉంది. కొత్త జట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్నే తమ రాష్ట్రానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా ఆంధ్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఐపీఎల్ టీమ్ కోసం పట్టుదల చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తమ సెకండ్ హోమ్ గ్రౌండ్గా విశాఖను ఎంచుకుంది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన రెండు మ్యాచ్లు వైజాగ్ వేదికగా జరిగాయి. ఈ మ్యాచ్లకు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు.