ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లే ఆఫ్స్ చేరితే టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. అయితే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో విజయాలు సాధించాలని చెప్పాడు. హోమ్ గ్రౌండ్లో గెలవకపోతే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో ప్రత్యర్థి వేదికలపై దుమ్మురేపుతున్న ఆర్సీబీ.. సొంతగడ్డపై మాత్రం తేలిపోతుంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఐపీఎల్ చరిత్రలోనే హోమ్ గ్రౌండ్లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న తొలి జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డ్ను తన పేరిట లిఖించుకుంది. ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ 46 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.

ఈ మ్యాచ్ అనంతరం ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో జరిగిన చర్చా కార్యక్రమంలో చతేశ్వర్ పుజారాతో కలిసి పాల్గొన్న అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'హోమ్ గ్రౌండ్లో వరుసగా మూడు ఓటములు. హోమ్ ఫామ్ ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దెబ్బతీస్తుందా?'అని హోస్ట్ ప్రశ్నించగా.. పుజారా కాదని చెప్పాడు. 'అలా ఏం జరగదు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ విజయాలు సాధిస్తోంది. గత మూడు మ్యాచ్ల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటుంది.'అని పుజరా బదులిచ్చాడు.
అంబటి రాయుడు మాత్రం.. హోమ్ మ్యాచ్లు గెలవకపోతే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కదని అభిప్రాయపడ్డాడు. 'హోమ్ గ్రౌండ్లో ఎదురైన పరాజయాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీస్తాయి. ఎందుకంటే ప్రతీసారి ప్రత్యర్థి వేదికలపై విజయం సాధించలేం. ప్రతర్థి జట్లు కూడా రోజు రోజు మెరుగ్గా బరిలోకి దిగుతాయి. కాబట్టి హోమ్ మ్యాచ్లు గెలవడం కీలకం. కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరితే మాత్రం టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ప్లే ఆఫ్స్ మ్యాచ్లు హైదరాబాద్, కోల్కతా వేదికగా జరుగుతాయి.'అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా 7 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో 4 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లో ఉండగా.. మరో మూడు మ్యాచ్లు ప్రత్యర్థి జట్ల వేదికల్లో జరగనున్నాయి. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే మరో 5 లేదా 4 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ప్రత్యర్థి జట్ల మైదానాలతో పాటు హోమ్ గ్రౌండ్లో కూడా విజయం సాధిస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. హోమ్ గ్రౌండ్లో జరిగిన గత మూడు మ్యాచ్ల్లో టాస్ ఓడటం ఆర్సీబీ కొంపముంచింది.