టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మళ్లీ మాట మార్చేసాడు. నిలకడలేని నిర్ణయాలతో కెరీర్లో.. రాజకీయ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రాయుడు.. క్రికెట్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కూడా మాట మార్చేసాడు. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఓ తెలుగు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవద్దని కోరుకుంటున్నానని జోకులు పేల్చాడు.
ఈ వ్యాఖ్యలపై ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ శుభారంభం చేయగానే.. రాయుడిపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేశారు. ఆర్సీబీ విజయం రాయుడికి చెంపదెబ్బ అనే కామెంట్స్ చేశారు. కానీ రాయుడు మాత్రం ఏకంగా మాటనే మార్చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో షోలో ఆర్సీబీ మాజీ ప్లేయర్ వరుణ్ ఆరోన్తో కలిసి మాట్లాడిన రాయుడు.. బెంగళూరు జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ సారి ఆర్సీబీ జట్టు బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలిచేలా కనిపిస్తుందని చెప్పాడు. 'ఈ సారి ఆర్సీబీ చాలా పటిష్టంగా ఉంది. టైటిల్ గెలిచే టీమ్లా కనిపిస్తోంది వరుణ్.. ఇలా ఎందుకు చెబుతున్నానంటే.. అతను ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్.'అని రాయుడు అనగానే.. వరుణ్ ఆరోన్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
ఈ వ్యాఖ్యలు తనను షాక్కు గురి చేశాయని చెప్పాడు. 'ధన్యవాదాలు.. రాయుడు చెప్పిన మాటలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ రోజు అతను పూర్తిగా ఆర్సీబీ మనిషిలా మారిపోయాడు.'అని వరుణ్ బదులిచ్చాడు. ఆ వెంటనే రాయుడు.. తాను ఎప్పుడూ ఆర్సీబీ సామర్థ్యాలను గుర్తిస్తానని, కానీ కొంతమంది నిజాన్ని జీర్ణించుకోలేరని నవ్వుతూ చెప్పాడు.
'నేను ప్రతీసారి ఆర్సీబీ సామర్థ్యం గురించి మాట్లాడుతాను. కానీ కొంతమంది నిజాన్ని జీర్ణించుకోలేరు.'అని రాయుడు సెటైర్లు పేల్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మాట మార్చడం రాయుడికి అలవాటు అయిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.