భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ శనివారం(మే17) నుంచి పున:ప్రారంభం కానుంది. మొత్తం 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లను నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. రివైజ్డ్ షెడ్యూల్ను సోమవారం రాత్రి బీసీసీఐ విడుదల చేసింది. శనివారం ఆర్సీబీ, కోల్కతా మధ్య బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 2025 సీజన్ పున: ప్రారంభం కానుంది.
బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై వేదికగా 13 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల వేదికలను త్వరలో ప్రకటించనున్నారు. భద్రతా కారణాలతో రద్దయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ను మళ్లీ నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లో జరగాల్సిన రెండు లీగ్ మ్యాచ్లతో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్లను కూడా తరలించారు. కోల్కతా వేదికగా జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ వేదికగా జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైనల్తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్ను అహ్మదాబాద్ వేదికగా జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. మిగతా ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ముంబైలోని వాంఖడే వేదికగా జరిగే అవకాశం ఉంది.

ఈ రివైజ్డ్ షెడ్యూల్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సౌతిండియా క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మ్యాచ్లను తరలించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో మొత్తం గుజరాత్ పెత్తనం నడుస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరే స్టేడియం లేనట్లు.. ప్రతీ టోర్నీలోనూ అహ్మదాబాద్కే ఎక్కువ మ్యాచ్లు కేటాయిస్తున్నారని మండిపడుతున్నారు. అహ్మదాబాద్ స్టేడియం వచ్చిన తర్వాత మిగతా మైదానాలకు ప్రాధాన్యత దక్కడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ల కేటాయింపు విషయంలో సౌతిండియాకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు.