ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఆ జట్టు దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కీలక సలహా ఇచ్చాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టును నిర్మించాలని సూచించాడు. మాజీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను తిరిగి కొనుగోలు చేయాలన్నాడు.
చాహల్తో పాటు రబడా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్లను తీసుకోవాలని సూచించాడు. అనుభవం కలిగిన బౌలర్లను తీసుకునేందుకు ప్రయత్నించాలన్నాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో ఒత్తిడికి గురికాకుండా బౌలింగ్ చేసే బౌలర్లను తీసుకోవాలన్నాడు. కుర్రాళ్ల కంటే అనుభవం కలిగిన ఆటగాళ్లు గేమ్ను బాగా అర్థం చేసుకుంటారని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వివరించాడు.

చాహల్ను కొనుగోలు చేయాలి..
'విరాట్ కోహ్లీ జట్టులోనే కొనసాగడం శుభవార్త. రిటెన్షన్కు ఆర్సీబీ పెద్దగా ఖర్చు పెట్టలేదు. జట్టు పర్స్లో చాలా డబ్బు ఉంది. వేలంలో ఖర్చు పెట్టేందుకు రూ. 83 కోట్లు ఉన్నాయి. ఇది ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. ఆర్సీబీ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ను కొనుగోలు చేయాలి. యుజ్వేంద్ర చాహల్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి.
ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావద్దు. చాహల్ను ఎప్పటికీ వదిలివేయవద్దు. అశ్విన్ను తీసుకునేందుకు కూడా ప్రయత్నించాలి. వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఆప్షన్. కానీ అశ్విన్కు మంచి అనుభవం ఉంది. అతను ఏం చేయగలడో తెలుసు. బ్యాట్తో కూడా జట్టుకు విజయాన్నందించగలడు.
అశ్విన్ను తీసుకుంటే..
ఈ ఇద్దరూ రాజస్థాన్ మాజీ స్పిన్నర్లు ఆర్సీబీలోకి వస్తే నేను చాలా సంతోషిస్తా. ఈ ఇద్దరికీ గేమ్ గురించి బాగా తెలుసు. మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం ఉంది. ఈ ఇద్దరిలో నేను యుజ్వేంద్ర చాహల్కు నేను తొలి ప్రాధాన్యత ఇస్తాను. చాహల్, అశ్విన్తో పాటు రబడా, భువనేశ్వర్ కుమార్లను తీసుకుంటే బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంటుంది. టోర్నీ విన్నింగ్ బౌలింగ్ అటాకింగ్గా మారుతోంది.
వేలంలో ఆర్సీబీ తరఫున నేను ప్రాధాన్యత ఇచ్చే నలుగురు ఆటగాళ్లు వీళ్లే. యుజీ చాహల్, కగిసో రబడా, భువనేశ్వర్ కుమార్, అశ్విన్ల కోసం నేను పర్స్లో ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తాను. మిగతా డబ్బుతో ఇతర ఆటగాళ్లను తీసుకుంటాను. వేలంలో రబడా చేజిక్కకపోతే.. మహమ్మద్ షమీని తీసుకోవాలి. షమీ కూడా దొరక్కపోతే.. అర్ష్దీప్ సింగ్ను కొనుగోలు చేయాలి.
ఇలా జట్టుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతిభ కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఆండీ ఫ్లవర్.. ఆర్సీబీ సపోర్ట్ స్టాఫ్.. దయచేసి సరైన ఆటగాళ్లను ఎంచుకోండి. మనం టైటిల్ గెలవాల్సిన అవసరం ఉంది. చిన్నస్వామి స్టేడియానికి సరిపోయే జట్టును నిర్మించండి.'అని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.
ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ(రూ. 21 కోట్లు)తో పాటు రజత్ పటీదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాల్(రూ.4 కోట్లు)లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ జట్టుకు ఇంకా మూడు ఆర్టీఎమ్ కార్డ్స్ ఉన్నాయి.