ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ మహమ్మద్ షమీ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో షమీ తీవ్రంగా నిరాశపర్చాడన్నాడు. షమీ వైఫల్యం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులోని అతని స్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమీ దారుణంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 48 పరుగులు ఇచ్చాడు. దాంతో అతనికి మరో ఓవర్ ఇచ్చేందుకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భయపడ్డాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. రూ. 10 కోట్ల భారీ ధర పెట్టి షమీని కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్కు నిరాశే ఎదురైంది. అతని వైఫల్యం జట్టు విజయవకాశాలు దెబ్బతీసింది.

ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో షమీ 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి భారత పేసర్గా చెత్త రికార్డ్ను మూటగట్టుకున్నాడు. మహమ్మద్ షమీ ప్రదర్శనపై ఓ ఛానెల్లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. అతను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.
'మహమ్మద్ షమీ ఐపీఎల్ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో షమీ లేకపోవడంతో బుమ్రా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆ సిరీస్లో షమీ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం షమీ ఫామ్ చూస్తుంటే ఆందోళనగా ఉంది. షమీ బౌలింగ్లో పేస్ తగ్గింది. సరైన లెంగ్త్ల్లో బౌలింగ్ చేయడం లేదు. షమీ ప్రధాన బలమే పేస్. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్. కానీ అతని బౌలింగ్లో నిలకడ లోపించింది. ఒకే ప్రదేశంలో బంతులు వేయలేకపోతున్నాడు.
ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ షమీ ఇలాంటి బౌలింగ్తో ఎలా రాణిస్తాడు? గాయం తర్వాత షమీ ఇలా బౌలింగ్ చేయడం తీవ్ర నిరాశకు గురి చేసింది. గాయం నుంచి కోలుకొని గతేడాదిగా ఆడుతున్నా.. అతను ఇంకా రిథమ్ అందుకోలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. ఐపీఎల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. అతని ఐపీఎల్ ప్రదర్శన ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులోని షమీ స్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.