ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖరారు చేసింది. ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్(ఆర్టీఎం) కార్డ్ కూడా ఉంది. అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రతీ జట్టు పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి.

ఈ డబ్బుతోనే వేలంలో ఆర్టీఎమ్తో పాటు 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనామక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఇద్దరు అనామక ఆటగాళ్లతో పాటు ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లలో విదేశీ ఆటగాళ్లపై ఎలాంటి పరిమితి విధించలేదు.
ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండటంతో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ లేని ఆటగాడిని అనామక ప్లేయర్గా పరిగణించవచ్చని పేర్కొంది. ఈ అన్క్యాప్డ్ రూల్ మళ్లీ తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2018 వరకు అమల్లో ఉన్న ఈ రూల్ను 2022 మెగా వేలంలో తొలగించారు. మళ్లీ తాజాగా ప్రవేశపెట్టారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోసమే ఈ రూల్ తీసుకొచ్చారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజా నిర్ణయంతో సీఎస్కే అతన్ని అనామక ప్లేయర్గా రూ. 4 కోట్లకే తీసుకోనుంది. అయితే ధోనీ ఒక్కడికే కాకుండా మరో 7 మంది భారత స్టార్ ఆటగాళ్లను ఈ నియమం కింద రిటైన్ చేసుకోవచ్చు.
ధోనీతో పాటు 8 మంది ఆటగాళ్లు...
పియూష్ చావ్లా: వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాకు కూడా అనామక ప్లేయర్ రూల్ వర్తిస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్కు ఆడుతున్న పియూష్ చావ్లా.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 192 మ్యాచ్లు ఆడి 192 వికెట్ల తీసాడు. అతన్ని ముంబై అనామక ప్లేయర్గా రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకోవచ్చు.
సందీప్ శర్మ: ఐపీఎల్ స్టార్ పేసర్ సందీప్ శర్మకు కూడా అన్క్యాప్డ్ రూల్ వర్తిస్తోంది. ఐపీఎల్లో అసాధారణ బౌలింగ్తో అదరగొడుతున్న సందీప్ శర్మ.. 127 మ్యాచ్ల్లో 137 వికెట్లు తీసాడు.
అమిత్ మిశ్రా: వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు కూడా అనామక ప్లేయర్ రూల్ వర్తిస్తోంది. ఇప్పటి వరకు అతను 174 వికెట్లు తీసాడు. అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది.
మోహిత్ శర్మ: వెటరన్ పేసర్ మోహిత్ శర్మకు కూడా ఈ నియమం వర్తించనుంది. గత రెండు సీజన్లు మోహిత్ శర్మ బంతితో దుమ్మురేపాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్లోయర్ బాల్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పటి వరకు 112 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మోహిత్ శర్మ.. 132 వికెట్లు తీసాడు.
విజయ్ శంకర్: ఆల్రౌండర్ విజయ్ శంకర్కు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ వర్తిస్తోంది. ఇప్పటివరకు 72 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన విజయ్ శంకర్.. 1115 పరుగులు చేశాడు.
కర్ణ్ శర్మ: లెఫ్టార్మ్ స్పిన్నర్ కర్ణ్ శర్మకు కూడా ఈ రూల్ వర్తిస్తోంది. 83 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కర్ణ్ శర్మ 76 వికెట్లు పడగొట్టాడు.
మయాంక్ మార్కండే: మయాంక్ మార్కండేను కూడా అనామకప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు. 26 ఏళ్ల మయాంక్ 37 మ్యాచ్ల్లో 37 వికెట్లు తీసాడు.