ఐపీఎల్ 2024 సీజన్ సక్సెస్ఫుల్గా ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో పూర్తి ఆధిపత్యం చెలాయించిన కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో సమష్టి ప్రదర్శనతో 8 వికెట్ల తేడాతో గెలిచిన కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మరోవైపు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది.
కెప్టెన్సీ మార్పు నిర్ణయం ఆ జట్టుకు తీరని నష్టం చేసింది. 14 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. టోర్నీలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్.. స్వయంకృపరాధంతోనే 10వ స్థానానికి పడిపోయింది. కెప్టెన్సీ మార్పుతో జట్టు రెండుగా విడిపోవడం.. స్టార్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం జట్టు వైఫల్యాలకు కారణమైంది.

వచ్చే సీజన్కు ముందు మెగా వేలంలో జరగనుంది. దాంతో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ ఫైనల్ కాలేదు. కానీ ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ప్రకారం అయితే ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. టీమ్స్ పర్స్ వాల్యూ పెంచే అవకాశం ఉంది. అయితే కొన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య 8కి పెంచాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిటైన్ పాలసీ రూపొందించిన తర్వాత ఆయా ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్లపై క్లారిటీ రానుంది.
ఒకవేళ నలుగురి ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఇస్తే.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వయసు రీత్యా రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ వీడ్కోలు పలకవచ్చు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే రిటెన్షన్కు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అంగీకరిస్తాడా? అనేది కూడా సందేహంగా మారింది. ఇతర జట్లలోకి వెళ్తే వారికి కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచిస్తే ఈ ఇద్దరూ కూడా ముంబై ఇండియన్స్కు దూరం కావచ్చు. ఏది ఏమైనా ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ రోహిత్ శర్మను కూడా తీసుకోవాలని భావిస్తే.. అతనితో పాటు హార్దిక్ పాండ్యా, సూర్య, జస్ప్రీత్ బుమ్రా రిటైన్ జాబితాలో ఉండవచ్చు. అయితే రిటైన్ పాలసీ ప్రకారం నలుగురు క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉండదు. అదే జరిగితే ముంబై ఇండియన్స్కు ముగ్గురే మిగులుతారు.