ఐపీఎల్ 2024 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. కీలక సమయంలో ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరమవ్వడం సీఎస్కే విజయవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా మతీష పతీరణ, ముస్తాఫిజుర్ రెహ్మా, దీపక్ చాహర్ వంటి పేసర్లు కీలక సమయంలో జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు.
ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించకపోగా.. రన్రేట్ను కూడా మెరుగుపరుచుకోలేకపోయింది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్లో చివరి వరకు ధోనీ, జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్తోనే ధోనీ కెరీర్ ముగిసిందనే ప్రచారం జరుగుతోంది. 42 ఏళ్ల వయసున్న ధోనీ వచ్చే ఏడాది ఆడుతాడా? లేదా? అనేది సందేహంగా మారింది.

నలుగురికే ఛాన్స్..
ఒకవేళ ఆడినా.. వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో అతన్ని రిటైన్ చేసుకుంటారా? లేదా? అనేది మిడిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని ఖరారు చేయలేదు.
గత మెగా వేలం రూల్స్ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు.
ఆర్టీఎమ్కు అవకాశం ఉంటే?
కొత్త టీమ్స్ ఎంట్రీతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో RTM(రైట్ టు మ్యాచ్)కు అవకాశం లేదు. ఈ ఆర్టీఎమ్ ప్రకారం వేలంలో ఏదైనా టీమ్ తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే.. ఆర్టీఎమ్ కింద సదరు ఆటగాడికి ఆ డబ్బు చెల్లించి తీసుకోవచ్చు. రిటైన్, ఆర్టీమ్ ప్రకారం గరిష్టంగా 5 గురు ఆటగాళ్లనే తీసుకోవాలి. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఆర్టీఎమ్కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
ఒకవేళ ఇచ్చినా ఐదుగురు ఆటగాళ్ల కంటే ఎక్కువ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అయితే 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రిటైన్ చేసుకునేది ఆ నలుగురే..
చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు స్టార్ ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, శివమ్ దూబే, స్టార్ పేసర్ మతీష పతీరణలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీమ్ అవకాశం కల్పిస్తే డెవాన్ కాన్వేను కూడా రిటైన్ చేసుకుంటుంది.
ఒక వేళ ధోనీ వచ్చే సీజన్ ఆడితే అతన్ని ఆర్టీమ్ కింద కొనుగోలు చేయవచ్చు. కానీ ఒక్క సీజన్ కోసం ఆ రిస్క్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. సీఎస్కే ఫ్రాంచైజీ వర్గాల ప్రకారం ధోనీ ఆ జట్టు మెంటార్గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది.