ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రక్రియను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని రూపొందించడంపై ఫోకస్ పెట్టింది. బుధవారం(జూలై 31) 10 ఫ్రాంచైజీల ఓనర్లతో ముంబైలో సమావేశం నిర్వహించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. వారి సూచనలు, సలహాలను స్వీకరించింది.
రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య గురించి చర్చించింది. మరోవైపు ఫ్రాంచైజీలు మెగా వేలానికి సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. వచ్చే మూడేళ్ల పాటు ఇదే జట్టు కొనసాగుతుండటంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆటగాళ్లు కూడా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని నిర్ణయాలు తీసుకోనున్నారు.

ముంబైకి సూర్య గుడ్బై?
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టును వీడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంపై సూర్య అసంతృప్తిగా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగానే అతను తన అసంతృప్తిని తెలియజేశాడు. కెప్టెన్సీ కోసం అతను మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ వేలంలోకి వస్తే మూడు జట్లు అతని కోసం తీవ్రంగా పోటీపడనున్నాయి.
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కొత్త కెప్టెన్ను ఎంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. కోహ్లీ అనంతరం జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్ను ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. అతని వయసు దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ వేలంలోకి వస్తే అతన్ని జట్టులోకి తీసుకునేందుకు ఆర్సీబీ సిద్దంగా ఉంది.
కుదిరితే ట్రేడింగ్ విండో ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ.. విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. సూర్యను జట్టులోకి తీసుకుంటే.. ఆ పరిస్థితి మారుతుందని ఆ జట్టు భావిస్తోంది.
2. పంజాబ్ కింగ్స్..
సరైన కెప్టెన్ లేని పంజాబ్ కింగ్స్ కూడా సూర్యకుమార్ యాదవ్ను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సూర్య వేలంలోకి వస్తే అతనిపై కోట్లు కుమ్మరించేందుకు కూడా పంజాబ్ కింగ్స్ వెనుకాడదు. వయసు మీదపడిన శిఖర్ ధావన్ను ఆ జట్టు వదులుకోనుంది. ఏళ్లు గడుస్తున్నా.. ఆటగాళ్లు మారుతున్నా ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ సారైన సరైన నాయకుడిని ఎంచుకోని మంచి ఫలితాన్ని అందుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.
3. లక్నో సూపర్ జెయింట్స్...
లక్నో సూపర్ జెయింట్స్ సైతం సూర్యను తీసుకునేందుకు ఆసక్తి చూపనుంది. ప్రస్తుత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్నో ఓనర్స్తో రాహుల్కు గొడవ జరిగిన నేపథ్యంలో అతను ఆ జట్టులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా లేవు. ఈ క్రమంలోనే సూర్యతో రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ జట్టు భావిస్తోంది.