ఐపీఎల్ 2025 సీజన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. సుదీర్ఘ కాలం పాటు ఆ జట్టును నడిపించిన రోహిత్ శర్మ ఐదు సార్లు విజేతగా నిలబెట్టాడు. టీమ్ భవిష్యత్తును ఆలోచించిన ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్.. రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది.
ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ శర్మ చిట్ చాట్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో ముంబై ఇండియన్స్తో తన ప్రయాణం ముగిసినట్లేననే రోహిత్ శర్మ పరోక్షంగా వెల్లడించాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్కు గుడ్ బై చెబుతాడనే ప్రచారం జరుగుతోంది.

అతను కేవలం ఐపీఎల్, సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రోహిత్ మెగా వేలంలోకి వస్తే అతనిని కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు కాచుకొని కూర్చున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రణాళికల ప్రకారం వచ్చే సీజన్ మెగా వేలం జరగనుంది. మెగా వేలంలో ముఖ్యంగా మూడు జట్లు అతనిపై కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది.
1. పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2024 సీజన్లో దారుణంగా విఫలమైన పంజాబ్ కింగ్స్.. ఓ ఐకానిక్ ప్లేయర్ కోసం ఎదురు చూస్తోంది. 37 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మ మరో మూడేళ్లు ఐపీఎల్ ఆడినా తమ జట్టుకు కలిసివస్తోందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.
ఇప్పటికే ఫిట్నెస్ సమస్యలతో పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న తమ కెప్టెన్ శిఖర్ ధావన్పై పంజాబ్ కింగ్స్ వేటు వేసేందుకు సిద్దమవుతోంది. అతని స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేసి జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై వేలంలో కోట్లు కుమ్మరించేందుకు సిద్దమవుతోంది.
2. కేకేఆర్
ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) టీమ్ కూడా రోహిత్ శర్మను కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చు. గౌతమ్ గంభీర్తో ఉన్న సత్సంబంధాలు, కేకేఆర్కు ఆడాలనే రోహిత్ శర్మ కోరిక ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ముంబైకి కాకుండా మరే ఏదైనా ఫ్రాంచైజీ కావాలనుకుంటే తాను కేకేఆర్కు ఆడుతానని రోహిత్ వెల్లడించాడు. అనుభవం కలిగిన ఆటగాడు జట్టులో ఉంటే కలిసొస్తుందని కేకేఆర్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
3. గుజరాత్ టైటాన్స్..
రోహిత్ శర్మపై గుజరాత్ టైటాన్స్ కూడా ఓ కన్నేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో శుభ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ దారుణంగా విఫలమైంది. హార్దిక్ పాండ్యా జట్టును వీడి ముంబై ఇండియన్స్లోకి వెళ్లిపోవడం ఆ జట్టును బలహీనంగా మార్చింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను వేలంలో కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి జట్టుకు పూర్వవైభవం తేవాలనుకుంటోంది.