ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలకమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. అక్టోబర్ 31నే పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. ఆశ్చర్యకరంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్ను వేలంలోకి వదిలేసింది. ఆ జట్టు మేనేజ్మెంట్తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో రిషభ్ పంత్.. ఢిల్లీని వీడినట్లు తెలుస్తోంది.
2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న రిషభ్ పంత్ను ఆ జట్టు మేనేజ్మెంట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కెప్టెన్సీ లేకుండా ఆటగాడిగా కొనసాగేందుకు పంత్ ఒప్పుకోకపోవడంతో ఆ జట్టు వేలంలోకి వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. కెప్టెన్సీ ఆఫర్ ఇస్తూ పలు ఫ్రాంచైజీలు రిషభ్ పంత్ను అప్రోచ్ అయ్యాయి.

ఇక ఐపీఎల్లో అరంగేట్ర చేసిన తర్వాత పంత్ వేలంలోకి రావడం ఇదే తొలిసారి. గత 8 ఏళ్లలో ఒక్కసారి కూడా పంత్ వేలంలో పాల్గొనలేదు. మరోవైపు రిషభ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు కాచుకు కూర్చోవడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిషభ్ పంత్ రికార్డ్ ధర పలుకుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈజీగా రూ. 25 కోట్ల నుంచి 30 కోట్లు పలుకుతాడని జోస్యం చెబుతున్నారు. ఇక రిషభ్ పంత్ కోసం మూడు జట్లు తీవ్రంగా పోటీపడనున్నాయి.
1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)
రిషభ్ పంత్ను టార్గెట్ చేసిన జట్లలో ఆర్సీబీ ముందు వరుసలో ఉంది. ఆ జట్టు విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, రజత్ పటీదార్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఈ ముగ్గురి కోసం రూ. 37 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా రూ. 83 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టుకు ఒక కెప్టెన్తో పాటు వికెట్ కీపర్ అవసరం ఉంది.
అంతేకాకుండా మిడిలార్డర్లో సత్తా చాటే పవర్ హిట్టర్ కూడా కావాలి. రిషభ్ పంత్ను కొనుగోలు చేస్తే ఈ మూడింటినీ భర్తీ చేయవచ్చని ఆర్సీబీ భావిస్తోంది. అంతేకాకుండా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నది. పంత్ పవర్ హిట్టింగ్కు సరిగ్గా సరిపోయే మైదానం. అతనికి సిక్స్లు కొట్టేందుకు అలవోకగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఎంత ధరైనా సరే పంత్ కొనుగోలు చేయాలని ఆర్సీబీ లక్ష్యంగా పెట్టుకుంది. అతని కోసం రూ. 25 కోట్ల వరకు పోటీపడేందుకు సిద్దమవుతోంది.

2. చెన్నై సూపర్ కింగ్స్..
ఆర్సీబీ తర్వాత పంత్ కోసం గట్టిగా పోటీపడే జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటికే ధోనీతో రిషభ్ పంత్ ఉన్నాడని ఆ జట్టు మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తెలిపాడు. పంత్ కూడా సీఎస్కేలోకి వెళ్లేందుకే మక్కువ చూపే అవకాశం ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని రిషభ్ పంత్తో భర్తీ చేయాలనే లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఈ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీష పతీరణ, శివమ్ దూబేలను రిటైన్ చేసుకుంది.
ఈ ఐదుగురి కోసం చెన్నై రూ. 65 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ. 55 కోట్లు ఉన్నాయి. పంత్ కోసం సీఎస్కే కూడా రూ. 20-25 కోట్ల వరకు వేలం పాడే అవకాశం ఉంది. ఒకవేళ పంత్ సీఎస్కేకు ఎంపికైతే సారథ్య బాధ్యతలు కూడా చేపట్టే ఛాన్స్ ఉన్నాయి.
3. పంజాబ్ కింగ్స్..
రిషభ్ పంత్ కోసం గట్టిగా పోటీ పడే జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ముందు వరుసలో ఉంది. ఎందుకంటే ఆ జట్టు శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ జట్టు వద్ద రూ. 110.50 కోట్ల భారీ ప్రైజ్మనీ ఉంది. ఇందులో నుంచి పంత్ కోసం రూ. 30 కోట్ల వరకు ఖర్చు పెట్టగలదు.
అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ హెడ్ కోచ్ రికీ పాంటింగే.. పంజాబ్ కింగ్స్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. పాంటింగ్తో పంత్కు మంచి సాన్నిహిత్యం ఉంది. అతని పర్యవేక్షణలో ఆడేందుకు పంత్ ఇష్టపడుతాడు. పాంటింగ్ సూచనలతోనే పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ను వీడాడనే ప్రచారం కూడా ఉంది. రిషభ్ పంత్తో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, కీపర్, మిడిలార్డర్ బ్యాటర్ స్థానాలను భర్తీ చేయవచ్చని భావిస్తోంది.