ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి ఎదురైంది. ఆదివారం వైజాగ్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్తో 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్కు ఇది వరుసగా రెండో పరాజయం. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్లో సన్రైజర్స్ ఏడో స్థానానికి పడిపోయింది. టీమ్ రన్ రేట్ కూడా దారుణంగా మారింది. మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ వైఫల్యం ఆ జట్టు పతనాన్ని శాసించింది. ముఖ్యంగా మూడు కారణాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిని శాసించాయి.
1.టాపార్డర్ వైఫల్యం..
సన్రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం టాపార్డర్ బ్యాటర్లు. కానీ ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ అనూహ్యంగా రనౌటవ్వడం.. ఇషాన్ కిషన్(2), నితీష్ కుమార్(0), ట్రావిస్ హెడ్(22)లను మిచెల్ స్టార్క్ పెవిలియన్ చేర్చడంతో భారీ స్కోర్ నమోదు చేయలేకపోయింది. ఈ టాప్-4 బ్యాటర్లలో ఇద్దరూ చెలరేగినా..ఫలితం మరోలా ఉండేది. పిచ్ కండిషన్స్.. ప్రత్యర్థి బౌలర్లను పట్టించుకోకుండా సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయడం దెబ్బతీసింది. సన్రైజర్స్ బ్యాటర్లంతా అనవసర షాట్లతోనే వికెట్లు పారేసుకున్నారు. మైదానానికి తగ్గ షాట్లను ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా మ్యాచ్ అనంతరం చెత్త షాట్లే ఓటమిని శాసించాయని తెలిపాడు.

2. హెన్రీచ్ క్లాసెన్ వికెట్..
37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ను హెన్రీచ్ క్లాసెన్, యువ బ్యాటర్ అనికేత్ వర్మ ఆదుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో వేగంగా పరుగులు చేశారు. 77 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మోహిత్ శర్మ విడదీసాడు. హెన్రీచ్ క్లాసెన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. క్లాసెన్ ఆ అనవసర షాట్ ఆడకుండా.. మరో 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ నమోదు చేసేది. క్లాసెన్ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా అనికేత్ వర్మకు అండగా నిలవలేదు. అతనికి ఒక్కరు సహకరించినా.. హైదరాబాద్ సునాయసంగా 200 ప్లస్ రన్స్ చేసేది. అప్పుడు మ్యాచ్ గెలవడానికి అవకాశాలు లభించేవి.
3. దెబ్బతీసిన ఇంపాక్ట్ ప్లేయర్..
ఇంపాక్ట్ ప్లేయర్గా వియాన్ మల్డర్ను బరిలోకి దించడం సన్రైజర్స్ కొంపముంచింది. కీలక బ్యాటర్లు ఔటవ్వడంతో అనికేత్ వర్మకు అండగా నిలుస్తాడని మల్డర్ను పంపించగా.. అతను తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో సన్రైజర్స్ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడమ్ జంపా లేకుండానే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. యువ స్పిన్నర్ జిషాన్ అన్సారీ మూడు వికెట్లతో చెలరేగాడు. అతనికి తోడుగా ఆడమ్ జంపా ఉండి ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది. మరోవైపు సన్రైజర్స్ పేసర్లు మహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా సన్రైజర్స్ పతనానికి కారణమైంది. పిచ్ కండిషన్స్ను అంచనా వేయడంలో దారుణంగా విఫలమైంది.