ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో పరాజయం ఎదురైంది. అదేం విచిత్రమో.. ఈ సీజన్లో ప్రత్యర్థుల వేదికలపై వరుస విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ.. సొంతగడ్డపై మాత్రం తేలిపోతుంది. రెండు వరుస విజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ.. గత మ్యాచ్లో వాంఖడే వేదికగా ముంబైపై సంచలన విజయాన్నందుకుంది. కానీ మళ్లీ సొంత మైదానంలో చతికిలపడింది. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ రెండు పరాజయాలు కూడా చిన్నస్వామి స్టేడియంలోనే ఎదురవ్వడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ మూడు తప్పిదాలు కొంపముంచాయి.
1. టాస్ ఓడిపోవడం
టాస్ ఓడిపోవడం ఆర్సీబీకి నష్టం చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. బౌలింగ్ ఎంచుకుంది. మైదానం చిన్నది కావడం.. డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీ ఛేజింగ్కు మొగ్గు చూపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. పిచ్ కండిషన్స్ను అంచనా వేయడంలో విఫలమైంది. తమ దూకుడు అప్రోచ్ను కొనసాగించింది. కొత్త బంతితో పరుగులు వచ్చినా.. పవర్ ప్లే అనంతరం వికెట్ స్లోగా మారింది. బంతి ఆగుతూ రావడంతో.. పరుగులు చేసేందుకు బ్యాటర్లు తడబడ్డారు.

ఈ విషయాన్ని గ్రహించిన ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్.. కండిషన్స్కు తగ్గట్లు స్లోగా బ్యాటింగ్ చేసి చివర్లో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం అతనే ఈ విషయాన్ని వెల్లడించాడు. కీపింగ్ చేయడంతో పిచ్ కండిషన్స్ బాగా అర్థమయ్యాయని చెప్పాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది. టాస్ గెలిస్తే ఆర్సీబీ కూడా బౌలింగ్ ఎంచుకునేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.
2. మిడిలార్డర్ వైఫల్యం..
మిడిలార్డర్ వైఫల్యం ఆర్సీబీ కొంపముంచింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(37), విరాట్ కోహ్లీ(22) అదిరిపోయే ఆరంభాన్ని అందించినా.. మిగతా బ్యాటర్లు ఆ జోరును కొనసాగించలేకపోయారు. రజత్ పటీదార్(22) మినహా దేవదత్ పడిక్కల్(1), లివింగ్ స్టోన్(4), జితేష్ శర్మ(3), కృనాల్ పాండ్యా(18) తీవ్రంగా నిరాశపర్చారు. టీమ్ డేవిడ్(37 నాటౌట్) సంచలన బ్యాటింగ్తో ఆర్సీబీ పోరాడే లక్ష్యాన్ని అందుకోగలిగింది. అతనికి తోడుగా మిడిలార్డర్లో ఒక్క బ్యాటర్ చెలరేగినా.. ఆర్సీబీ 180-190 రన్స్ చేసేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.
3. కొంపముంచిన క్యాచ్ డ్రాప్..
యశ్ దయాల్ వేసిన నాలుగో ఓవర్లో కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్ను ఎక్స్ట్రా కవర్స్లో రజత్ పటీదార్ నేలపాలు చేశాడు. అప్పటికి రాహుల్ చేసింది 5 పరుగులు మాత్రమే. ఈ అవకాశంతో చెలరేగిన రాహుల్.. 93 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. ముఖ్యంగా జోష్ హజెల్ వుడ్ వేసిన 15వ ఓవర్లో 4, 4, 2, 2, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. అప్పటి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ఈ ఒక్క ఓవర్తో ఢిల్లీ వైపు మళ్లింది. గేమ్ ఛేజింగ్ మూమెంటమ్గా నిలిచింది. రజత్ పటీదార్ క్యాచ్ పట్టినా.. హజెల్ వుడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా ఆర్సీబీకి ఆశించిన ఫలితం దక్కేది.