ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి తొలి పరాజయం ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి జోరు కనబర్చిన ఆర్సీబీకి గుజరాత్ టైటాన్స్ కళ్లెం వేసింది. బుధవారం బెంగళూరు వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది. సొంతమైదానంలో జరిగిన తొలి మ్యాచ్లోనే ఆర్సీబీ ఓడటం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా మూడు తప్పిదాలు ఆర్సీబీ పతనాన్ని శాసించాయి.
1. టాస్ ఓడిపోవడం..
ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం ఆర్సీబీ కొంపముంచింది. కొత్త పిచ్ కావడంతో పేసర్లకు కొత్త బంతితో మూవ్మెంట్ లభించింది. ఈ అడ్వాంటేజ్ను ఉపయోగించుకున్న మహమ్మద్ సిరాజ్.. తొలి బంతి నుంచే ఆర్సీబీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. దూకుడుగా ఆడే ఫిల్సాల్ట్ను కట్టడి చేశాడు. భారీ స్కోర్ చేయాలనే ఆతృతలో ఆర్సీబీ బ్యాటర్లు వేగంగా ఆడాలనే ప్రయత్నంలో అనవసర షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడి స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే.. ఫలితం మరోలా ఉండేది.

2. టాపార్డర్ వైఫల్యం..
గత రెండు మ్యాచ్ల్లో చెలరేగిన ఆర్సీబీ టాపార్డర్ తాజా మ్యాచ్లో దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ వైఫల్యం ఆర్సీబీ పతనాన్ని శాసించింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ అనంతరం రజత్ పటీదార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. టాప్-3 బ్యాటర్లలో ఏ ఒక్కరు చెలరేగిన ఫలితం మరోలా ఉండేది.
3. దెబ్బ తీసిన సిరాజ్..
ఆర్సీబీ మాజీ ప్లేయర్ అయిన మహమ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శనతో తన పాత్ర ఫ్రాంచైజీని దెబ్బతీసాడు. పవర్ ప్లేలోనే కీలకమైన రెండు వికెట్లు తీసిన సిరాజ్.. చివర్లో క్రీజులో సెట్ అయిన లియామ్ లివింగ్ స్టోన్ను ఔట్ చేశాడు. దాంతో ఆర్సీబీ తమ లక్ష్యానికి 10-15 పరుగుల తక్కువగా చేసింది. లివింగ్ స్టోన్ ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది.