ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మంది షార్ట్ లిస్ట్ చేసింది.
అయితే ఈ జాబితాలో 13 ఏళ్ల కుర్రాడికి చోటు దక్కింది. భారత్కు చెందిన వైభవ్ సూర్యవంశీ మెగా వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే షార్ట్ లిస్ట్ అయిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు. వేలంలో అతను అమ్ముడుపోయినా నయా రికార్డ్ సాధిస్తాడు. బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అండర్ 19 ఆసియాకప్ టోర్నీకి ఎంపికయ్యాడు.

బిహార్కు చెందిన ఈ కుర్రాడు ఆ రాష్ట్ర రంజీ టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్లో సంచలనంగా మారిన ఈ కుర్రాడిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ వన్డే కప్లో వైభవ్ శతకంతో రాణించాడు.
నవంబర్ 24, 25(ఆది, సోమవారం) తేదీల్లో సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది పోటీ పడనున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
భారత్కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. 12 మది అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. 70 ఓవర్సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగే మెగా వేలం మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారిక బ్రాడ్కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్తో పాటు జియోసినిమా మెగా వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
రూ.2 కోట్ల కనీస ధరతో 81 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కోటిన్నర ధరతో 27 మంది, రూ. కోటి 25 లక్షలతో 18 మంది, కోటీ రూపాయలతో 23 మంది, రూ. 75 లక్షలతో 92 మంది, రూ. 50 లక్షలతో 8 మంది, రూ. 40 లక్షలతో 5 మంది, రూ. 30 లక్షలతో 320 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ సారి మార్క్యూ ప్లేయర్ల జాబితాలో 12 మందికే అవకాశం ఇచ్చారు. ఈ జాబితాను రెండు సెట్లుగా విభజించారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో పాటు కగిసో రబడా, అర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ మార్క్యూ సెట్-1లోనే ఉన్నారు. వేలంలో తొలి ప్లేయర్గా జోస్ బట్లర్ పేరు రానుంది.