ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రకటించింది. ఐదు టైటిళ్లతో జట్టును దిగ్విజయంగా నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ.. తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
దాంతోనే ఐపీఎల్ 2024 సీజన్ ట్రోఫీ ఫొటో షూట్ కార్యక్రమానికి సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ హాజరయ్యాడు. తాజా నిర్ణయంతో ధోనీ ఈ సీజన్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాడా? లేక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతాడా? లేకుంటే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్గా కొనసాగుతాడా? అనేది తెలియాల్సి ఉంది.

జడేజాను విస్మరించారా..?
మరోవైపు సీనియర్ ఆల్రౌండర్, ఎక్స్ ఫ్యాక్టర్ రవీంద్ర జడేజాకు కాకుండా కుర్రాడైన రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం ఏంటనే చర్చ జోరు అందుకుంది. ధోనీతో జడేజాకు ఉన్న విభేదాలే అతనికి సారథ్య బాధ్యతలు దక్కకుండా చేశాయనే ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2022 మెగా వేలం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్.. తమ సారథ్య బాధ్యతలను జడేజాకు అప్పగించింది.
అయితే కెప్టెన్సీ ఒత్తిడిని జడేజా తట్టుకోలేకపోయాడు. అతని సారథ్యంలో చెన్నై దారుణ ప్రదర్శన చేసింది. వరుస పరాజయాలతో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. దాంతో సీజన్ మధ్యలోనే జడేజాను తప్పించి ధోనీ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం జడేజా గాయం పేరిట టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
ధోనీతో గొడవలే కారణమా..?
ఆ సమంలో ధోనీ, జడేజా మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగింది. కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని జడేజా అవమానంగా భావించాడనే వార్తలు వచ్చాయి. జడేజా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని వీడేందుకు కూడా సిద్దమయ్యాడనే కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారాన్ని అప్పట్లో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఖండించాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో ధోనీ సారథ్యంలో ఆడిన జడేజా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో చెన్నైని గెలిపించాడు. దాంతో జడేజా-ధోనీ మధ్య విభేదాలు అనే ప్రచారానికి కాస్త తెరపడింది. కానీ రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ప్రకటించడంతో మళ్లీ మొదలయ్యాయి.
పరిగణలోకి తీసుకోలేదంతే..
ధోనీతో విభేదాల కారణంగానే జడేజాకు కెప్టెన్సీ ఇవ్వలేదా? అని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్మేనేజ్మెంట్ మా మైకేల్ ప్రతినిథి ప్రశ్నించగా.. వారు ఈ ప్రచారాన్ని ఖండించారు. జడేజాను తాము కెప్టెన్గా పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో అతను కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడని, తన వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బతిన్నదని గుర్తు చేశారు.
ధోనీ-జడేజా మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. దేశవాళీ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండటంతో పాటు 27 ఏళ్ల కుర్రాఢు కావడంతో సారథిగా అతనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాధానం ఇచ్చారు.