ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ తాత్కలిక కెప్టెన్ సామ్ కరణ్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఇది కొత్త వికెట్. గత మ్యాచ్ విజయంతో మా జట్టులో ఉత్సాహం నెలకొంది. ఇదో అద్భుతమైన స్టేడియం. ఇక్కడి ప్రేక్షకుల అభిమానం ప్రత్యేకం. ఈ మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు తీయడం మా ప్లాన్.

గత మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యాన్ని చేధించిన తర్వాత మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. సీఎస్కే అద్భుతమైన జట్టు. మేం కాస్త ధైర్యంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగిస్తున్నాం.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. 'ఈ మైదానంలో లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. విపరీతమైన డ్యూ వస్తుంది. కానీ గత మ్యాచ్లో మేం అద్భుత ప్రదర్శనతో 78 పరుగుల తేడాతో గెలిచాం. అయితే ఈ మ్యాచ్లో మతీష పతీరణతో పాటు తుషారా దేశ్పాండే దూరమయ్యారు.
ఆరంభం నుంచి దూకుడుగా ఆడి భారీ స్కోర్ చేసే ప్రయత్నం చేస్తాం. టోర్నీలో ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ గెలవడం కీలకమే. పతీరణ, దేశ్పాండే ఫిట్గా లేరు. వారి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లెస్సన్ ఆడుతున్నారు.'అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లెస్సన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, సామ్ కరణ్, రీలీ రోసౌ, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్