IPL 2024 Auction: వన్డే ప్రపంచకప్ 2023 ముగియడంతో ఐపీఎల్ సందడి మొదలైంది. వచ్చే నెల 19న ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. అయితే ఈ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వెళ్తున్నాడనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. క్యాష్ ట్రేడింగ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్కు రూ. 15 కోట్లు చెల్లించి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ డీల్పై గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఒకటి ఇరు జట్ల పరస్పర అంగీకారంతోని ఈ క్యాష్ ట్రేడింగ్ డీల్ పూర్తయిందని పేర్కొంది. హార్దిక్ పాండ్యాను తీసుకున్నందుకు ముంబై ఇండియన్స్ రూ.15 కోట్లను గుజరాత్ టైటాన్స్కు చెల్లించనుంది. హార్దిక్ స్థానంలో ముంబై ఇండియన్స్కు చెందిన ప్లేయర్ను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ అంగీకరించలేదు.

హార్దిక్ పాండ్యా దూరమవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ పోస్ట్ ఖాళీ అయ్యింది. ఇక గుజరాత్ తమ జట్టు సారథ్య బాధ్యతలను యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ లేదా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్కు అప్పగించే అవకాశం ఉంది.
భారత భవిష్యత్తు సారథిగా కనిపిస్తున్న శుభ్మన్ గిల్కే సారథ్య బాధ్యతలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. గత సీజన్లో 3 శతకాలతో 890 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.
హార్దిక్ పాండ్యా ఏడేళ్ల పాటు ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. 2015లో కనీస ధర రూ.10 లక్షలకు పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయగా.. సంచలన ప్రదర్శనతో మరుసటి ఏడాదే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు.
వెన్ను గాయంతో సుదీర్ఘ విరామం తీసుకున్న హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వదులుకుంది. అతడిని సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా.. రెండో సీజన్లో జట్టును ఫైనల్ చేర్చాడు.
ఇక హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్కు భారీ డబ్బు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హార్దిక్కు కూడా కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.