ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరుకుంది. 70 మ్యాచ్ల లీగ్ దశ విజయవంతంగా ముగిసింది. మంగళవారంతో ప్లే ఆఫ్స్కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్-4లో నిలిచిన కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్), సన్రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్తాన్ రాయల్స్(RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.
టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనున్నాయి. బుధవారం జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లకు అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే గత 8 లీగ్ మ్యాచ్ల్లో మూడు వర్షంతో రద్దయ్యాయి. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ కూడా వర్షంతో తుడిచి పెట్టుకుపోయింది.

ఈ క్రమంలోనే ప్లే ఆఫ్స్ మ్యాచ్లు వర్షంతో రద్దయితే ఏం చేస్తారు? అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతోంది. ప్లే ఆఫ్స్కు రిజర్వ్ డే ఉందా..? ఉంటే ఆ రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తారు..? సూపర్ ఓవర్స్ టై అయితే ఏం చేస్తారు అనే సందేహాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ప్లే ఆఫ్స్కు రిజర్వ్ డే..
ఐపీఎల్ 2024 సీజన్లో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు రిజర్వ్ డే కేటాయించారు. షెడ్యూల్ తేదీల్లో వర్షంతో మ్యాచ్ రద్దయినా రిజర్వ్ డే పూర్తి మ్యాచ్ ఆడిస్తారు. అంతేకాకుండా ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ఫలితాన్ని తేల్చేందుకు రెండు గంటల ఎక్స్ట్రా టైమ్ ఉంటుంది. సాధారణ లీగ్ మ్యాచ్ల్లో ఈ టైమ్ గంటనే. కానీ ప్లే ఆఫ్స్లో రెండు గంటలు ఆలస్యంగానైనా ఓవర్లను కుదించి ఫలితాన్ని తేల్చే ప్రయత్నం చేస్తారు. అప్పటికీ మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే పూర్తి మ్యాచ్ ఆడిస్తారు.
రిజర్వ్ డే కూడా రద్దయితే..
ఇక రిజర్వ్ డే కూడా వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దయితే.. పాయింట్స్ టేబుల్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు. ఉదాహరణకు సన్రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ మ్యాచ్ రిజర్వ్ డే కూడా సాధ్యం కాకపోతే.. టేబుల్ టాపర్ అయిన కేకేఆర్ ఫైనల్ చేరుతోంది.
సూపర్ ఓవర్ టై అయితే..
ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ఇరు జట్ల స్కోర్లు టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే నిర్ణీత సమయంలో ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్స్ నిర్వహిస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే.. పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీమ్ను విజేతగా ప్రకటిస్తారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు వర్ష సూచన అయితే లేదు.