ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరడంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, సీఎస్కే తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో సీఎస్కే విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతోంది.
ఓడితే మాత్రం రన్రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ కంటే సీఎస్కే రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నైని ఓడించడంతో పాటు మెరుగైన రన్ రేట్ సాధించాలి. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 218 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ను ఆ జట్టు 200లోపు కట్టడి చేస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతోంది. లేదంటే ఇంటిదారి పడుతోంది. ఇరు జట్లు సమంగా విజయాలు సాధించినప్పుడు నెట్ రన్రేట్ను పరిగణలోకి తీసుకుంటారు. నెట్ రన్రేట్ ద్వారానే పాయింట్స్ టేబుల్ స్థానాలను కూడా నిర్ణయిస్తారు. ఈ క్రమంలోనే అసలు క్రికెట్లో నెట్రన్రేట్ అంటే ఏంటి? దీన్ని ఎలా లెక్కిస్తారో అనే విషయం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
నెట్రన్ రేట్ ఫార్మూలా..
నెట్ రన్ రేట్ = (టోర్నీలో చేసిన మొత్తం రన్స్/టోర్నీలో ఆడిన మొత్తం ఓవర్లు) - (అదే టోర్నీలో మొత్తం ఇచ్చుకున్న రన్స్/టోర్నీలో ప్రత్యర్థులు ఆడిన ఓవర్లు)
ఎలా లెక్కిస్తారంటే..?
ఐపీఎల్లో లీగ్ దశలో ప్రతీ జట్టు 14 మ్యాచ్లు ఆడితే అందులో మొత్తం మ్యాచ్ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్ని రన్స్ పర్ ఓవర్గా నిర్ణయిస్తారు.
అలాగే అదే జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్టు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఆ మ్యాచ్లో నిర్దేశించిన ఓవర్ల కన్నా తక్కువ ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కింద లెక్కిస్తారు. చేజింగ్లో ముందే లక్ష్యాన్ని అందుకుంటే అన్ని ఓవర్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇలా వచ్చిన సగటును జట్టు పరుగుల సగటు నుంచి తీసివేస్తే వచ్చేదే నెట్రన్రేట్.