రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తమ బౌలర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ కీలక మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(30 బంతుల్లో 8 ఫోర్లతో 45), రియాన్ పరాగ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 36), షిమ్రాన్ హెట్మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26) సత్తా చాటారు. చివర్లో రోవ్మన్ పోవెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/33) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు. అయితే ఈ 17వ ఓవర్లో యశ్ దయాల్ వరుసగా రెండు బౌండరీలు ఇవ్వడంతో కోహ్లీ సహనం కోల్పోయాడు.
రాజస్థాన్ రాయల్స్ విజయానికి 24 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమయంలో యశ్ దయాల్ తొలి రెండు బంతులను కట్టడిగా వేసి సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే మూడో బంతిని యార్కర్ వేసే ప్రయత్నం చేయగా.. ఫుల్టాస్గా వచ్చిన ఈ బంతిని హెట్మైర్ బౌండరీ బాదాడు.
ఆ తర్వాతి బంతిని కూడా స్లాట్లో వేయడంతో బౌండరీ తరలించాడు. కీలక సమయంలో లూజ్ బాల్స్ వేయడంతో కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ.. బౌలర్పై కోప్పడ్డాడు. కూల్ డ్రింక్ బాటిల్ను విసిరికొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.