రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ జట్టు వీడితే ఆర్సీబీ జట్టును కుక్కలు కూడా పట్టించుకోవని హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన ఆర్సీబీ అభిమానులు తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ డై హార్డ్ ఫ్యాన్స్ ఒకరు సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ వద్దకు నేరుగా వెళ్లి అతని కాళ్లు మొక్కడంతో పాటు హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. విరాట్ కోహ్లీ సానుకూలంగానే స్పందించినా.. అప్రమత్తమైన సెక్యూరిటీ అతన్ని మైదానం బయటకు ఈడ్చుకొచ్చారు.
అంతటితో ఆగకుండా సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని చితకబాదారు. ఆర్సీబీ మేనేజ్మెంట్కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీనే సదరు అభిమానిపై పిడి గుద్దుల గుద్దారు. ఈ వ్యవహారాన్ని ఓ అభిమాని తన మొబైలో చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్గా మారింది. కొసమెరుపు ఏంటంటే.. ప్రైవేట్ సెక్యూరిటీ సదరు అభిమానిని చితకబాదుతంటే పోలీసులు నిలబడి చూశారు.

ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు.. ఆర్సీబీ మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులను ట్రీట్ చేసే విధానం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. అభిమానులే లేకుంటే ఈ ఐపీఎల్.. ఆటగాళ్లంతా ఎక్కడిదని మండిపడుతున్నారు. మైదానంలోకి వెళ్లి అతను తప్పు చేస్తే చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని, అలా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోను షేర్ చేసిన ప్రణీత్ అనే ఎక్స్ యూజర్.. ఆర్సీబీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 'ఆర్సీబీ మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి ప్రవర్తనను ఊహించలేదు. ఎవరి మీదా చెయ్యి చేసుకునే హక్కు మీకు లేదు. అలా చేయడం చట్ట విరుద్దం. రూల్స్ అతిక్రమిస్తే అరెస్ట్ చేసి జైళ్లో పెట్టాలి. లేదంటే భారీ జరిమానా విధించాలి. అంతేగానీ స్టేడియంలోనే అతన్ని చితక బాదుతారా? ఒక్కసారి విరాట్ కోహ్లీ ఆర్సీబీని వీడితే ఈ ఫ్రాంచైజీని ఎవరూ పట్టించుకోరు'అని ఘాటుగా విమర్శలు గుప్పించాడు.