IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ మెగా వేలానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సమాయత్తమవుతోంది. రిటెన్షన్ ప్రక్రియలో సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. 11 మంది ఆటగాళ్లను వదిలేసింది. ప్రధాన ఆటగాళ్లు హజెల్ వుడ్, హర్షల్ పటేల్, వానిందు హసరంగాలను కూడా ఆ జట్టు వదిలేసింది.
ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ నుంచి రూ. 17.50 కోట్ల అత్యధిక ధర చెల్లించి కామెరూన్ గ్రీన్ను తీసుకుంది. షెహ్బాజ్ అహ్మద్ను సన్రైజర్స్ హైదరాబాద్కు బదిలి చేసి.. మయాంక్ దగార్ను తీసుకుంది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ట్రేడింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.

క్యాష్ డీల్ ద్వారా రూ. 12 కోట్లు చెల్లించి జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం ఆ జట్టు పర్స్లో రూ.23.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. బుమ్రాను తీసుకుంటే రూ.11.25 కోట్లు మాత్రమే మిగులుతాయి. డిసెంబర్ 19న జరిగే ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ ముగ్గురి ఆటగాళ్లపై కన్నేసింది.
ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్లతో పాటు న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్రలను తీసుకునేందుకు ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వస్తే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ల కోసం ప్రయత్నించదు. బుమ్రా రాకుంటే మాత్రం.. హజెల్ వుడ్ స్థానాన్ని స్టార్క్, కమిన్స్ల్లో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది.

ఇక వానిందు హసరంగాను వదులుకున్న ఆర్సీబీ..ఆ తరహా స్పిన్ ఆల్రౌండర్ అయిన రచిన్ రవీంద్రతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రయత్నిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023లో రచిన్ రవీంద్ర అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. భారత సంతతికి చెందిన అతని స్వస్థలం బెంగళూరు కావడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ అతనికి తొలి ప్రాధాన్యత ఇస్తోంది. రచిన్ రవీంద్ర సైతం తనకు ఆర్సీబీ తరఫున ఆడాలని ఉందని చెప్పాడు.