ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఉన్న విభేదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముంబై ఇండియన్స్ సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించడాన్ని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ విషయం గుజరాత్ టైటాన్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్లోనే స్పష్టమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా అటు గుజరాత్ టైటాన్స్, ఇటు రోహిత్ శర్మ అభిమానులు.. హార్దిక్ పాండ్యాను ఓ ఛీటర్గా ట్రీట్ చేశారు. మ్యాచ్ ఆసాంతం రోహిత్ శర్మ తమ సారథి అంటూ ఎగతాళి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రోల్ చేశారు.

ఎన్నడూ లేని నెగటివిటీ..
భారత్లో సొంత అభిమానులచే ఎగతాళి చేయబడ్డ ఏకైక ఆటగాడిగా హార్దిక్ పాండ్యా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. తన జీవితంలోనే ఎన్నడూ లేని నెగటివిటీని హార్దిక్ సొంతం చేసుకున్నాడు. ఓ వైపు బుమ్రా.. మరోవైపు రోహిత్ శర్మ అతనికి ఏ మాత్రం సహకరించలేదు. ఈ విషయం తొలి మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది.
అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ విమర్శించారు. కెప్టెన్సీ తప్పిదాలను పాయింట్ ఔట్ చేసి మాట్లాడారు. గతంలో ముంబై ఇండియన్స్ అసలు ఓటమే ఎరగనట్లు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని హార్దిక్ పాండ్యా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసినా.. రోహిత్, బుమ్రాలు మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తించారు.
హార్దిక్కు సహకరించని బుమ్రా..
మ్యాచ్ సమయంలో హార్దిక్ పాండ్యా ఇచ్చిన సలహాలను జస్ప్రీత్ బుమ్రా పట్టించుకోలేదు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా.. రోహిత్ను వెనుకాల నుంచి హగ్ చేసుకోగా అతను సీరియస్ అయ్యాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. గుజరాత్ టైటాన్స్తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది.
ఈ పరాజయానికి హార్దిక్ పాండ్యా బాధ్యుడిని చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా గట్టిగా జరిగింది. వాస్తవం ఏంటంటే ఈ మ్యాచ్ పరాజయానికి ప్రధాన కారణం తెలుగు తేజం తిలక్ వర్మ. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో అతను సింగిల్స్ తీయకుండా బాల్స్ డాట్ చేశాడు. సింగిల్ వచ్చే అవకాశం ఉన్న నిరాకరించాడు.

బచాయించిన తిలక్ వర్మ..
దాంతో ఆ ఓవర్లో 3 పరుగులే రావడంతో ముంబై బ్యాటర్లపై మరింత ఒత్తిడి పెరిగింది. టీమ్ డేవిడ్ వికెట్ కాపాడేందుకే తిలక్ వర్మ సింగిల్స్ తీయలేదనే వాదన వినిపించింది. కానీ ఇది సరైన తీరు కాదని తెలుగు కామెంటేటర్ అంబటి రాయుడు అన్నాడు. సింగిల్స్ తీయకుండా తిలక్ వర్మ ఘోర తప్పిదం చేశాడని, స్పిన్ ఆడలేని టీమ్ డేవిడ్ను ఎందుకు ముందు తప్పించారని కూడా విమర్శించాడు.
మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తిలక్ వర్మను వెనకేసుకొచ్చాడు. అతని తప్పిదం లేదని తెలిపాడు. హార్దిక్, రోహిత్ గొడవ నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రోహిత్ కెప్టెన్సీలోనే ఇది జరిగి ఉంటే తిలక్ వర్మను దారుణంగా ట్రోల్ చేసేవారని అభిమానులు భావిస్తున్నారు.